ఎవరొస్తారో.. ఏమిస్తారో
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వేములవాడలో జరుగుతున్నది ప్రచారమా? లేక ప్రజాస్వామ్యం ఖూనీనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 28 వార్డుల్లో ఓటర్ల ఇళ్ల తలుపులు తెరిచే ఉన్నాయి. లైట్లు ఆన్లోనే ఉన్నాయి. కానీ, ఆ వెలుగు ప్రజాస్వామ్యానికి కాదు, డబ్బు రాజకీయాలకు. అభివృద్ధి మాటలు పోస్టర్లకే పరిమితం కాగా, ఓటు విలువ మాత్రం రాత్రికి రాత్రి పెరుగుతోంది. గడప దాటే ప్రతీసారి ప్రజాస్వామ్యం మెడపై కత్తి పడుతున్న పరిస్థితి. ఓటరు మనసు కాదు.. ఓటరు జేబే రాజకీయమయ్యింది. హామీలు కాదు, చేతికి అందేదే ప్రమాణం. వీధుల్లో నినాదాలు వినిపిస్తున్నా, గల్లీల్లో మాత్రం లెక్కలు జరుగుతున్నాయి. ‘ఈసారి ఎంత?’ అన్న ప్రశ్నే కేంద్రంగా మారింది. ఇది ఎన్నికల పోరాటం కాదు.. ప్రజాస్వామ్య ఖూనీకి తెరలేపిన రాత్రి జాగరణగా మారుతోంది. ఒకవైపు అభ్యర్థుల హడావుడి, మరోవైపు ఓటర్ల ఎదురుచూపులు, అభ్యర్థుల అనుయాయుల పంపకాలు, ఈ మధ్యలో రాజ్యాంగ విలువలు మౌనంగా రక్తం కారుస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


