గుర్తుకొస్తున్నాయి..!
చదివిన స్కూల్లో పోలింగ్ కేంద్రం..
తనిఖీ చేసిన ఐఏఎస్ మంద మకరంద్
రాజన్న సిరిసిల్లలో అరుదైన ఘటన
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి మంద మకరంద్ మంగళవారం జిల్లా కేంద్రంలోని 39వ వార్డులో 115,116,117వ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సిరిసిల్లలో తాను చిన్నప్పుడు చదువుకున్న కాకతీయ ఇంగ్లిష్మీడియం స్కూల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం విశేషం. జిల్లాలోని గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటకు చెందిన మంద మకరంద్ చిన్నప్పుడు సిరిసిల్లలో చదువుకున్నారు. ఆయన అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ టీచర్లు. ఈ సందర్భంగా ఆ స్కూల్ విద్యార్థులు మకరంద్కు పూలతో స్వాగతం పలికారు. స్కూల్ కరస్పాండెంట్ గుగ్గిళ్ల జగన్గౌడ్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. స్కూల్లో కలియ తిరిగి చిన్ననాటి సంగతులను మకరంద్ గుర్తు చేసుకున్నారు. అనంతరం సిరిసిల్ల గీతానగర్ హైస్కూల్లోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మకరంద్ పరిశీలించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా తదితరులు పాల్గొన్నారు.


