‘ఎన్ని అడ్డంకులు సృష్టించినా మత్స్యకార భేటీ సక్సెస్‌’ | Kakani Govardhan Reddy Fires On Chandrababu Govt Diversion Politics | Sakshi
Sakshi News home page

‘ఎన్ని అడ్డంకులు సృష్టించినా మత్స్యకార భేటీ సక్సెస్‌’

Apr 16 2026 4:52 PM | Updated on Apr 16 2026 4:54 PM

Kakani Govardhan Reddy Fires On Chandrababu Govt Diversion Politics

సాక్షి, నెల్లూరు జిల్లా: కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ వేదికగా వైఎస్‌ జగన్‌ నిర్వహించిన మత్స్యకార భేటీ అద్భుత విజయం సాధించిందని, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా గంగపుత్రులు నీరాజనం పట్టారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ పర్యటనకు లభించిన భారీ స్పందన చూసి ఓర్వలేకనే కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర లేపిందని కాకాణి స్పష్టం చేశారు. కాకాణి ఇంకా ఏం మాట్లాడారంటే..

అడ్డంకులు సృష్టించినా ఆగని జన ప్రవాహం:
జువ్వలదిన్నెలో వైఎస్‌ జగన్‌ పర్యటనను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడింది. హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ అనుమతిని ఆఖరి నిమిషం వరకు పెండింగ్‌లో పెట్టారు. రవాణా శాఖ అధికారులతో వాహనాలను నిలిపివేసి, బారికేడ్లు పెట్టినా జనం ఆగలేదు. వేట సాగనివ్వమని, పథకాలు ఆపేస్తామని స్థానిక నేతలు మత్స్యకారులను బెదిరించినా, 4 వేల మందికి పైగా తరలివచ్చి వైఎస్‌ జగన్‌కి నీరాజనం పట్టారు. అది చూసి ఓర్చుకోలేకనో పచ్చ మీడియా రోత రాతలు రాస్తోంది. ఆ మీడియాల సర్టిఫికేట్లు మాకవసరం లేదు.

ఆనం గారూ.. ఆ ఘటన మీకు గుర్తుందా?:
జువ్వలదిన్నెలో వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు గర్హనీయం. 2011లో సోంపేట మత్స్యకారులపై కాల్పులు జరిగినప్పుడు ఆనం మంత్రిగా ఉన్నారు. ఆ విషయం ఆయన మర్చిపోయినట్లు ఉన్నారు. మత్స్యకారుల రక్త చరిత్ర జగన్‌ది కాదు. మీ హయాంలో జరిగిన కాల్పులది. సోంపేటలో థర్మల్‌ ప్లాంట్‌ వద్దు అన్నదే వైఎస్‌ జగన్‌. కానీ, మీరు మాత్రం అన్నీ మర్చిపోయారు. చంద్రబాబులా మతిమరుపుతో మాట్లాడుతున్నారు.

ఇంకా తమ ప్రాంతానికి వచ్చి, తమ వలలు తెంపి చేపలు వేటాడుతున్న పొరుగు రాష్ట్ర మెకనైజ్డ్‌ బోట్లను స్థానిక మత్స్యకారులు స్వాధీనం చేసుకుంటే, వాటిని విడిచిపెట్టింది టీడీపీ నేతలు. ఈ విషయం ఆనంకు తెలియదా? జువ్వలదిన్నె హార్బర్‌ పనులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే 2019–24 మధ్య జరిగాయి. అందుకే ఇకనైనా వాస్తవాలు మాట్లాడాలని అదే పనిగా అబద్దాలు వల్లె వేయొద్దని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మంత్రి ఆనంకు హితవు చెప్పారు.

మత్స్యకారులకు వైఎస్‌ జగన్‌ భరోసా: రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
వైఎస్‌ జగన్‌ జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్భర్‌ పర్యటనకు రావడం మత్స్యకారులకు భరోసానిచ్చింది. కావలి నియోజకవర్గంలో దురాయి వేసినా, ఎన్ని అంక్షలు పెట్టినా, మండుటెండను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన వారందరికీ పార్టీ తరపున ధన్యవాదాలు. మత్స్యకారులకు ఆస్తిగా ఇచ్చిన జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ ప్రైవేటీకరణ చర్య సరికాదు. దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్ధితుల్లోనూ దాన్ని అడ్డుకునేలా చూస్తాం. మత్స్యకారులకే హార్బర్‌ చెందేలా చేస్తాం.

పొరుగు రాష్ట్రాల మెకనైజ్డ్‌ బోట్లు ఇక్కడ చేపల వేటకు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయని, అవి వలలను తెంపి, తమ బోట్లను కూడా ధ్వంసం చేస్తున్నాయని స్థానిక మత్స్యకారులు మొర పెట్టుకుంటే జగన్‌ హామీ ఇచ్చారు. మరో వైపు పోలీసులు, మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉన్న బోట్లను దొంగచాటుగా ఎత్తుకుని పోతే వాటిని తీసుకుని రాకుండా ప్రభుత్వం, అధికార పార్టీ మీన మేషాలు లెక్కిస్తోంది. ఇప్పటికైనా ఆ బోట్లను వెనక్కి తీసుకుని రావాలి. మత్స్యకారులకు వైఎస్‌ జగన్‌ ఎప్పటికీ అండగా ఉంటారు.

డిఫెన్స్‌ అకాడమీకి జువ్వలదిన్నె భూమి ఇవ్వడం తప్పు: పి.చంద్రశేఖర్‌రెడ్డి
మత్స్యకారులకు తోడుగా నిల్చేలా వైఎస్‌ జగన్‌ 10 పిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. ఆయన ఏ మంచి పని చేసినా కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసే పనిలో పడింది. ఆ దిశలోనే జువ్వలదిన్నె హార్బర్‌కు చెందిన భూమిని ఒక ప్రైవేటు డిఫెన్స్‌ అకాడమీకి ఇవ్వడం దారుణం. మరో చోట భూమి ఇచ్చే అవకాశం ఉన్నా ఫిషింగ్‌ జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ భూమి కేటాయించం తప్పు.

మత్స్యకారులకు రూ.10 వేలు ఇచ్చిన ఘనత జగన్‌ది: కిలివేటి సంజీవయ్య
నాడు సూళ్లూరుపేటలో జగన్‌ని కలిసిన మత్స్యకారులు చేపల వేట నిషేధ సమయంలో తమను ఆదుకోవాలని కోరారు. తమిళనాడు ప్రభుత్వం అక్కడి మత్స్యకారులకు రూ.5 వేలు ఇస్తోందని వారు చెప్పగా, తాము అధికారంలోకి వస్తే, రూ.10 వేలు ఇస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే మాట నిలబెట్టుకున్నారు. మత్స్యకార భరోసా కింద వారికి ఆర్థిక సాయం చేశారు.

వైఎస్‌ జగన్‌పై మత్స్యకారులకు అపార విశ్వాసం: కాకాణి పూజిత
వైఎస్‌ జగన్‌ది జువ్వెలదిన్నె పర్యటన సందర్బంగా ఎన్ని అడ్డంకులు పెట్టినా పెద్ద సంఖ్యలో హాజరైన మత్స్యకారులు తమకు కేవలం ఆయన వల్లే మేలు జరుగుతుందని గట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. అదే వారు బలంగా నమ్ముతున్నారు కూడా. అదే నిజం. వైఎస్‌ మాట మీద నిలబడతారు. రేపు అధికారంలోకి వచ్చాక, జువ్వెలదిన్నె హార్బర్‌ను మత్స్యకారులకు అప్పగిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement