సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూర్ఖత్వం హిట్లర్ను మించిపోయిందని ఎద్దేవా చేశారు. కొంత మంది ఐపీఎస్లు తమ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రైతులు, రాష్ట్ర ప్రజల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు. ఎవరు మాట్లాడితే వాళ్లపై కేసులు పెడుతున్నారు. మన్నే క్రిశాంక్తో పాటు ఏడుగురిపై అక్రమ కేసు పెట్టారు. ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ అక్రమ కేసులు పెడుతుంది. ఓ కేసులో అనుముల హనుమంత రెడ్డి అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడిగితే కేసు పెడతారా?. రేవంత్ రెడ్డి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. కేసులతో గొంతు నొక్కలేవు.
కొంత మంది ఐపీఎస్లు మా ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు. బెంగళూరు నుంచి హ్యాకర్లను తెచ్చి మాపై నిఘా పెడుతున్నారు. అలాంటి అధికారులు జాగ్రత్త. మీరు రిటైర్డ్ అయిన మిమ్మల్ని వదలం. రేవంత్ సగం కాలం పూర్తయ్యింది. ఇంకా మిగిలి ఉన్న సగ కాలం అయిన మంచిగా పని చేయాలి. రైతుల సమస్యలను రాష్ట్రంలో పట్టించుకునే నాధుడే లేడు. ఆనాడు తాలు తీస్తే తోలు తీస్తా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎటు పోయాడు?. యాసంగి పంటకు బోనస్ ఇస్తారా లేదా రేవంత్ సమాధానం చెప్పాలి. రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టవా?. జూబ్లీహిల్స్ ప్యాలెస్ ఏసీలో కూర్చుంటే సమస్యలు ఎలా తెలుస్తాయి?. రేవంత్ మళ్ళీ గెలిచేది లేదు. ఉన్నన్ని రోజులు అయిన మంచిగా పని చేయాలి’ అని వ్యాఖ్యలు చేశారు.


