భక్తజన గుంపు
కొమరాడ: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం నాగవళి–జంఝావతి నదీ సంగమం నడుమ కొలువదీరిన గుంపస్వామేశ్వరుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలలు, శ్రీకాకుళం, ఒడిశాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాగావళి నది ఇసుక తిన్నెలు, సమీప పామాయిల్ తోటల్లో టెంట్లు వేసి ఆదివారం రాత్రి జాగారం చేశారు. సోమవారం వేకువజామునే నదీ స్నానాలు ఆచరించి పరమశివుడిని దర్శించుకున్నారు. శివనామాన్ని స్మరించారు. సర్పంచ్ సుంకరి సుగణ ఆధ్వర్యంలో సంకీర్తనలు, భజనలు, కోలాట ప్రదర్శనలు నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థలు, భక్తులు ఆలయ ప్రాంగణంలో భక్తులకు మంచి నీరు, అన్నదానం, పులిహార ప్రసాదం పంపిణీ చేశారు.
ఆదాయం పుల్.. అభివృద్ధి నిల్..!
గుంపస్వామేశ్వరుని ఆలయంలో కార్తీక మాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో వేలాదిమంది భక్తులు, ప్రముఖులు దర్శనం చేసుకుంటారు. దీనివల్ల దేవదాయ శాఖకు ఆదాయం దండిగా వస్తుంది. అయినా ఆలయ అభివృద్ధిని కనీసం పట్టించుకోవడం లేదని భక్తులు మండి పడుతున్నారు. సమీపంలోని గ్రామస్తులు, కాపారపు ఫౌండేషన్ సేవల తప్ప, ప్రభుత్వం పరంగా ఏ విధంగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న పురాతన ఆలయం చుట్టూ రాతికట్ట నిర్మించాలని భక్తులు డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు నాగవళి–జంఝావతి నదులు ఉప్పొంగినప్పుడు ఆలయంలోకి నీరు చొరబడుతోంది. ఆ దేవదేవుడు మహిమ, కరుణాకటాక్షంతో ఆలయం కొట్టుకుపోవడంలేదని, ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
పరవశించిన శివుడు.. భక్త సెలయేరు
గుంపస్వామేశ్వరుడు ఆలయానికి పోటెత్తిన భక్తులు
శివ నామస్మరణతో మారుమోగిన గుంప
జనంతో ఉప్పొంగిన నాగావళి, జంఝావతి సంగమం
భక్తజన గుంపు


