టికెట్ల విక్రయంతో రూ.3.13లక్షల ఆదాయం
కొమరాడ: మండలంలోని గుంపసోమేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులకు టికెట్ల అమ్మకం ద్వారా రూ.3,13,141 ఆదాయం సమకూరినట్టు ఈఓ బి.శ్రీనివాసరావు తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా ఆది, సోమవారం ఆలయానికి విచ్చేసిన భక్తులకు రూ.10ల టికెట్ల అమ్మకంతో రూ.73,400, రూ.30ల టికెట్ల అమ్మకంతో రూ.1,09,890, రూ.50ల టికెట్ల విక్రయాల వల్ల రూ.98,201, మార్కెట్ ద్వారా రూ.31,650 వచ్చినట్లు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి రూ.18,150 పెరిగిందని తెలిపారు.
పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు
● జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి జీవనరాణి
డెంకాడ: ఏడాది నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జీవనరాణి వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. డెంకాడ పీహెచ్సీని ఆమె సోమవారం సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలన్నారు. కార్యాలయంలో ఎలాంటి లావాదేవీలైనా ఈ–ఆఫీసు విధానంలో నమోదు చేయాలన్నారు. మండలంలో 42 అంగన్వాడీ కేంద్రాలు, 47 పాఠశాలల్లో 5,360 మంది విద్యార్థులకు మాత్రలు అందజేయాల్సి ఉందని పీహెచ్సీ డాక్టర్ అనూష డీఎంహెచ్ఓకు తెలియజేశారు.
జిందాల్ రైతుల అమరావతి బాట
శృంగవరపుకోట: జిందాల్ పరిశ్రమకోసం భూములిచ్చిన నిర్వాసితులు అమరావతికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు బొడ్డవరలో సోమవారం సమావేశమై రాజధాని పెద్దలకు తమ సమస్య తెలియజేయాలని నిర్ణయించారు. అధికారులు, రాజకీయనాయకులు, కంపెనీ ప్రతినిధులు తమకు అన్యాయం చేస్తున్నారంటూ వాపోయారు. నిర్వాసితులకు అనుగుణంగా కోర్టు తీర్పు ఇచ్చినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, ఈ దమనకాండను రాజధాని పెద్దలకు తెలియజెప్పేందుకు 200 మందికి తక్కువకాకుండా పయనమవుతామని పేర్కొన్నారు.
రైల్వే పనులపై ప్రత్యేక శ్రద్ధ
విజయనగరం కలెక్టరేట్: జిల్లాలో జరుగుతున్న పలు రైల్వే ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేకదృష్టి సారించారు. ప్రత్యేక లైజనింగ్ అధికారిగా కెఆర్సీ ప్రత్యేక ఉపకలెక్టర్ ఇ.మురళీని నియమించారు. సీసీఎల్ఏ ఆదేశాల మేరకు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్న విధానంలో లోపాలపై ఎప్పటికప్పుడు సమీక్షించి తొలగించేందుకు పలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సాధించేందుకు కృషి చేస్తారు. ఈస్టుకోస్ట్ రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్లు, జిల్లా రెవెన్యూ అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టులు నిర్ణీత గడువులోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని మురళీని కలెక్టర్ ఆదేశించారు.
ఓపీ సేవలు నిలిపివేత
రాజాం: రాజాంలోని ప్రైవేటు ఆస్పత్రులను కొంతమంది కావాలనే టార్గెట్ చేసి డబ్బులు గుంజుతున్నారని ఆరోపిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజాం విభాగం మూడురోజుల కిందట సమ్మెకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా సోమవారం నుంచి మూడురోజులు పాటు అత్యవసర సేవలు మినహా ఓపీ సేవలు నిలుపుదలచేస్తున్నట్టు ప్రకటించింది. జీఎంఆర్ కేర్ ఆస్పత్రిలో మాత్రం ఓపీ సేవలు కొనసాగాయి. మిగిలిన ఆస్పత్రుల వైద్యులు, యాజమాన్యం ఓపీని నిలుపుదలచేయడంతో పేషెంట్లు ఇబ్బందులు పడ్డారు. పొరపాటున పేషెంట్ చనిపోతే కొంతమంది సంఘాలుగా ఏర్పడి డబ్బులు గుంజుతున్నారని వైద్యులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయంచేయాలని కోరడంలో తప్పులేదని, వైద్యులపై దాడులు చేయడం తగదన్నారు.


