మెప్మా కుంభకోణంలో ఉద్యోగులపై వేటు
ఎనిమిది మంది ఉద్యోగుల సస్పెన్షన్ కలెక్టర్ ఆదేశాల మేరకు మెప్మా పీడీ ఉత్తర్వులు
నరసరావుపేట: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో నకిలీ గ్రూపులు సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వ్యవహారంలో ఎనిమిది మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా పీడీ మురళీకృష్ణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మెప్మాలో జరుగుతున్న అవతకవకలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా స్వయంగా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో పట్టణంలో సుమారు 150 వరకు నకిలీ గ్రూపులు సృష్టించి రూ.20 కోట్ల వరకు బ్యాంకుల నుంచి రుణాలు పొందారనే ఆరోపణలు వైఎస్సార్సీపీ నుంచి వెల్లువెత్తాయి. వచ్చిన ఆరోపణలపై జిల్లా కలెక్టర్ మెప్మా పీడీ, డీఎస్పీ, నరసరావుపేట ఆర్డీఓలతో ఒక విచారణ కమిటీ వేశారు. వీరు పలువురిని విచారించిన తర్వాత జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేశారు. దీనిపై కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను అనుసరించి నరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల సిటీ మిషన్ మేనేజర్లు తుమ్మా దీప, ఉమర్ వలి, జి.శ్రీనివాసరావు, చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఎం.మల్లికార్జునరావు, జి.భూదేవి, బి.విజయప్రణతి, కె.శ్రీనివాసరావు, డి.బాలాంజనేయులును సస్పెండ్ చేసినట్లు మెప్మా పీడీ మురళీకృష్ణ పేర్కొన్నారు.


