ఒక్క మాత్రతో ‘నులి’మేద్దాం
● ఆల్బెండజోల్ మాత్రలతో నులిపురుగులకు చెక్
● ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో మాత్రల పంపిణీ
● 1 నుంచి 19వ వయస్సు లోపు పిల్లలందరికీ
● నేడు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం
ఆల్బెండజోల్ మాత్రలను మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత మాత్రమే విద్యార్థులకు ఇవ్వాలి. మాత్రలు తీసుకున్న తర్వాత ఏవిధమైన ఇబ్బందులు ఎదురైతే వెంటనే దగ్గరలోని వైద్య సిబ్బందిని సంప్రదించాలి. పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పిల్లలు తప్పకుండా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకునేలా చూడాలి.
– కాంతారావునాయక్, జిల్లా ప్రోగ్రాం
అధికారి, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం
ఆల్బెండజోల్ మాత్రల డోస్ ఇలా..
నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఏడాది నుంచి రెండేళ్లలోపు చిన్నారులకు ఆల్బెండజోల్ సగం మాత్ర(200 ఎంజీ) నీటిలో కలిపి తాపాలి. 2 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు 400 ఎంజీ మాత్రను మధ్యాహ్నం భోజనం తరువాత చప్పరించేలా చూడాలి. మింగకుండా వైద్య సిబ్బంది పర్యవేక్షించాలి. ఏదైనా పరిస్థితుల దృష్ట్యా మంగళవారం మాత్రలు తీసుకోని వారు ఉంటే వారి కోసం మాప్ అప్ డే రోజున ఈనెల 24వ తేదీ మరోమారు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మాత్రలు అందజేయనున్నారు.
గోస్పాడు: చిన్నారులను పీడించే అనారోగ్య సమస్యల్లో నులిపురుగులు ప్రధానమైనవి. ఈ పురుగులు పిల్లల కడుపులో చేరి మెలిపెడుతూ పిల్లల్లో పేలతనం, నీరసం, ఆహారం సరిగా తీసుకోకపోవడం తరచూ కనిపిస్తుంటోంది. ఈ పురుగులు రక్తహీనత, పోషకలోపం, పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంటాయి. సహజంగా తలెత్తే ఈ సమస్య పరిష్కారానికి ఏడాదికి రెండు సార్లు జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.మంగళవారం (ఈనెల 17న) జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం రోజున అంగన్వాడీలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసేందుకు వైద్య,ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది. జిల్లాలో 1663 అంగన్వాడీ కేంద్రాలు, 3318 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఆల్బెండజోల్ మాత్రలు వేసేలా గుర్తించారు. వీటి పరిధిలో 1–2 ఏళ్ల లోపు పిల్లలు 35,163 మంది, 2–19 సంవత్సరాల లోపు పిల్లలు 4,03,312 మంది పిల్లలు కాగా మొత్తంగా 4,38,475 మంది పిల్లలు ఉన్నట్లు జిల్లా వైద్యశాఖ అధికారులు గుర్తించారు. వీరందరికీ ఆల్బెండజోల్ మాత్రలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
ఒక్క మాత్రతో ‘నులి’మేద్దాం


