సహకార సంఘాల్లో స్తంభించిన సేవలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యోగుల సమ్మె కారణంగా ఉమ్మడి జిల్లాలోని 99 సహకార సంఘాల్లో అన్ని కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక పిలుపు మేరకు ఉద్యోగులు సోమవారం నిరవధిక సమ్మెకు శ్రీకారం చుట్టారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకు బ్రాంచ్ల ఎదుట పీఏసీఎస్ల సీఈఓలు, ఇతర ఉద్యోగులు బైఠాయించి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్నూలు కృష్ణానగర్లోని డీసీసీబీ బ్రాంచ్ ఎదుట జరిగిన నిరసనలో ఉమ్మడి జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక అధ్యక్షుడు హరిఫ్ బాషా మాట్లాడారు. డిసెంబరు 6 నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించలేదని, సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు.


