చమురు నిక్షేపాల కోసం బోరుబావులు
● ఆందోళనలో రైతులు
దొర్నిపాడు: నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలంలోని క్రిష్టిపాడు గ్రామంలో రెండు రోజుల నుంచి పంటపొలాల్లో బోరుబావులు తవ్వుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డీజిల్, పెట్రోల్ వంటి చమురు నిక్షేపాల కోసం సర్వే చేస్తున్నట్లు తవ్వకాలు చేస్తున్నవారు చెబుతున్నారు. 60 మీట్లర్ల ఒకటి చొప్పున 100 అడుగుల లోతు వరకు బోర్లు వేస్తున్నారు. ప్రస్తుతం శనగ పంటకోతలు జరుగుతుండగా మరో వైపు బోరుబావులు వేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం రైతులకు సమాచారం ఇవ్వకుండా త మ పొలాల్లో బోర్లు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు 20 చోట్ల బోర్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై దొర్నిపాడు తహసీల్దార్ సుభద్ర మాట్లాడుతూ.. చమురు నిక్షేపాల కోసం ఓఎన్జీసీ అధికారులు గతంలోనే వచ్చారని, తవ్వకాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
అర్జీలను గడువులోగా పరిష్కరించండి
● జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా, నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 100 దరఖాస్తులు స్వీకరించబడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉమా మహేశ్వరి తదితర శాఖల అధికారులు పాల్గొని ప్రజల అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ రామునాయక్ మాట్లాడుతూ, ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖలకు సరైన విధంగా కేటాయించాలని సూచించారు. నిర్ణీత సేవా ప్రమాణాల గడువు (ఎస్ఎల్ఏ) దాటి పోకుండా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా మొత్తం 34 దరఖాస్తులు స్వీకరించామన్నారు.
దృష్టి పోర్టల్పై శిక్షణ ప్రారంభం
నంద్యాల(న్యూటౌన్): స్థానిక డిప్యూటీ డీఈవో ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఐడీఎస్ఎస్ స్కూల్ అసిస్టెంట్లకు, ఐఈఆర్టీహెచ్ఐ, ఎమ్మార్లకు దృష్టి పోర్టల్పై మూడు రోజుల శిక్షణ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. జిల్లా విద్యాధికారి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు నూతన విద్యా విధానం అమలు చేయడానికి సమగ్ర శిక్ష రూపొందించిన దృష్టి పోర్టల్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. డిప్యూటీ డీఈవో శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి భవిత కేంద్రాల్లో ఐఈఆర్టీలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐడీఎస్ఎస్ స్కూల్ అసిస్టెంట్లు సమగ్ర శిక్ష అందించిన ట్యాబ్లలో ప్రత్యేక అవసరాల పిల్లలకు విద్యా బోధన చేయాల్సి ఉంటుందన్నారు. స్టేట్ రిసోర్స్ పర్సన్ జస్నా, బ్రీజిత్ మరియా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త జగన్మోహన్ రెడ్డి, మాధవీలత, ప్రసన్న కుమార్, శ్రీనివాసులు, స్కూల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
చమురు నిక్షేపాల కోసం బోరుబావులు


