‘పది’కి అల్పాహారం
లక్ష్మణచాంద: పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులు అల్పాహారం అందక అర్ధాకలితోనే చదువుకునేవారు. ఈ ప్రభావం పరీక్షా ఫలితాలపై పడేది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సోమవారం నుంచి పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందనుంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం లేదా సాయంత్రం వేళ ఒకసారి విద్యార్థులకు ఉడికించిన శనగలు, పెసలు లేదా బిస్కెట్లు లాంటి అల్పాహారం అందజేస్తున్నారు. ప్రత్యేక తరగతుల్లో సాయంత్రం అందించే అల్పాహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రోజుకు రూ.15 కేటాయించింది.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
నిర్మల్ జిల్లాలో 108 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 3,580 మంది విద్యార్థులు, ఆదిలాబాద్లో 100 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో 3,324 మంది, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 51 పాఠశాలల్లో 2,225 మంది, మంచిర్యాల జిల్లాలో 97 పాఠశాలల్లో 2,885 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అల్పాహారంతో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన 12,014 మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది.
ఉమ్మడి జిల్లా సమాచారం
జిల్లా పాఠశాలలు విద్యార్థులు వచ్చిన నిధులు
నిర్మల్ 108 3,580 రూ.10,20,300
ఆదిలాబాద్ 100 3,324 రూ.9,47,340
కు.ఆసిఫాబాద్ 51 2,225 రూ.6,3,410
మంచిర్యాల 97 2,885 రూ.8,16,525


