‘ఎన్నికలు అడ్డుకోవడం దుర్మార్గం’
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఎన్నిక సజావుగా జరగకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం క్యాతనపల్లిలోని తన నివాసంలో సీపీఐ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రజలు తమకు ఓటు వేసి 14స్థానాల్లో గెలిపించారని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సింది పోయి ప్రజలపై ఉన్న కోపాన్ని తమ మీద చూపిస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. మంగళవారం నిర్వహించే ఎన్నికలకు సీపీఐ, బీఆర్ఎస్ రాష్ట్రస్థాయి ప్రతినిధులు కూడా హాజరవుతారని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని స్పష్టంచేశారు. ఒకవేళ ఎన్నిక సజావుగా జరగకకుంటే పోలీసులు కాంగ్రెస్తో కుమ్మక్కయ్యారనే భావన ప్రజల్లో కలుగుతుందని హెచ్చరించారు. ఎన్నిక వాయిదా ఘటన, పరిణామాలపై కలెక్టర్, పోలీస్ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి వివేక్ వద్ద డబ్బులు ఎక్కువగా ఉంటే పేదలకు సాయం చేయాలే గాని ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీయటం తగదని సూచించారు. ఏఐటీయూసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్, బీఆర్ఎస్, సీపీఐ నాయకులు డాక్టర్ రాజారమేశ్, రామడుగు లక్ష్మణ్, సంపత్, సుదర్శన్గౌడ్, మిట్టపల్లి శ్రీనివాస్ తదితరులున్నారు.


