‘బెదిరించి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు’
మంచిర్యాలటౌన్: బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు బెదిరించి కాంగ్రెస్లోకి చేర్చుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. 45వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ను వ్యాపారం నడవకుండా చేస్తానని, డివిజన్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వనని బెదిరించిన ఎమ్మెల్యే బలవంతంగా కాంగ్రెస్లో చేర్చుకున్నారని ఆరోపించారు. 23వ డివిజన్ అభ్యర్థిపై దాడులు చేసి బలవంతంగా పార్టీలోకి చేర్చుకున్నారని తెలిపారు. హైటెక్సిటీ కాలనీ, జన్మభూమినగర్ కాలనీ ప్రజలను ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకుని కాంగ్రెస్ను గెలిపిస్తేనే అభివృద్ధి చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 53వ డివిజన్లో దొంగ ఓట్లు వేసిన కాంగ్రెస్ నాయకులు దొరికారని, వారిని పోలీసులకు అప్పగించినా ఎలాంటి చర్యలు లేవని పేర్కొన్నారు. అధికారులు ఎన్నికల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. కనీసం ఓటర్లకు ఓటరు స్లిప్పులు కూడా పంచలేదని ఆయన ఆరోపించారు.


