డిజిటల్ క్రాప్ సర్వేకు సన్నద్ధం
జిల్లాలో సర్వే వివరాలు
క్లస్టర్లు గ్రామాలు సర్వేయర్లు ఎకరాలు
55 371 371 3,52,077
దండేపల్లి: జిల్లాలో పంటల సాగుకు సంబంధించి కచ్చితమైన వివరాల సేకరణకు ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్) చేపడుతోంది. ప్రస్తుత యాసంగి సాగు వివరాలను వ్యవసాయ శాఖ సిబ్బందితోపాటు ప్రైవేటు సర్వేయర్ల ద్వారా ప్రత్యేక యాప్లో నమోదుకు నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ గోపి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి సర్వేలో కొంత మార్పులు చేయాలని సూచించారు. 45 రోజులపాటు సర్వేకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో క్లస్టర్ల వారీగా ఏఈవోలు పంటల నమోదు చేపట్టగా ఈసారి రెవెన్యూ గ్రామాల వారీగా డిజిటల్ క్రాప్ సర్వేకు ఆదేశించారు. క్లస్టర్కు ఒక ఏఈవో ఉండడంతో రెవెన్యూ గ్రామాల వారీగా సర్వే చేయాలంటే ఇబ్బంది అవుతుందని, అలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ గ్రామానికో ప్రైవేటు సర్వేయర్ను నియమించుకోవాలని మండల వ్యవసాయ అధికారులకు సూచించారు. బీఎస్సీ అగ్రికల్చర్, అగ్రికల్చర్ డిప్లొమా, సైన్స్ డిగ్రీ చదివిన వారికి మొదటి ప్రాధాన్యతగా, లేనిపక్షంలో కనీసం పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని సర్వే చేసేందుకు నియమించుకోవచ్చని పేర్కొన్నారు. ఒక్కో ఫొటో తీసి సర్వే వివరాలు యాప్లో నమోదు చేసినందుకు రూ.7చొప్పున చెల్లిస్తారు.
సర్వేయర్ల ఎంపిక పూర్తవగానే..
డిజిటల్ క్రాప్ సర్వే కోసం ప్రైవేటు సర్వేయర్ల ఎంపిక ప్రక్రియ పూర్తవగానే సర్వే ప్రారంభించనున్నారు. ఏ సమస్యా లేని వాటిని మాత్రమే ప్రైవేటు సర్వేయర్లు సర్వే చేస్తారు. సమస్యాత్మక సర్వే నంబర్ల(అటవి, నాన్ డిజిటల్)కు సంబంధించిన వాటిని ఏఈవోలు చేస్తారు.
ప్రయోజనాలు అనేకం..
డిజిటల్ క్రాప్ సర్వేతో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నష్ట పరిహారం చెల్లింపులు, రాయితీల కల్పన, బీమా అమలు సులభం అవుతుంది. పంటల ఉత్పత్తుల విక్రయాలు, రైతుల సమస్యల పరిష్కారానికి వీలవుతుంది. దిగుబడి అంచనాలతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి విషయాల్లో స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.


