పిల్లలకు చరిత్రపై అవగాహన అవసరం
హొసపేటె: హంపీ చారిత్రక వారసత్వం గురించి పిల్లల్లో అవగాహనకు కన్నడ వర్సిటీ ద్వారా నెలకు ఒకసారి ప్రత్యేక ఉపన్యాసం నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప తెలిపారు. హంపీ ఉత్సవ్– 2026 సందర్భంగా కమల మహల్ వేదికలో పురావస్తు శాఖ, విజయనగర జిల్లా యంత్రాంగం సహకారంతో నిర్వహించిన విజయనగర అధ్యయనంపై 28వ వార్షిక సింపోజియంను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. హంపీ అభివృద్ధి కోసం భారత పురావస్తు సర్వే సంస్థకు కొత్త ప్రతిపాదన సమర్పించామన్నారు. పర్యాటకులు హంపీలోని అన్ని ఆలయాలు, స్మారకాలను సులభంగా వీక్షించేలా స్మారక చిహ్నాలను అనుసంధానించే రోడ్లను నిర్మించడానికి ఒక ట్రావెల్ రోడ్ ప్రాజెక్ట్ను రూపొందించారన్నారు. దీని వల్ల పర్యాటకులు వందలాది స్మారకాలను సులభంగా చూడటానికి వీలు కలుగుతుందన్నారు. కూడ్లిగి ఎమ్మెల్యే శ్రీనివాస్, జిల్లాధికారి కవిత ఎస్. మన్నికేరి తదితరులు పాల్గొన్నారు.


