‘బెల్టు’పై సమరం
● గ్రామాల్లో మత్తుకు చెక్ పెట్టేలా తీర్మానాలు ● బెల్ట్షాపుల బంద్కు నిర్ణయం ● అమ్మితే జరిమానా.. పట్టిస్తే నజరానా ● నూతన పాలకవర్గాలతో గ్రామాల్లో మార్పు ● యువత, గ్రామ భవిష్యత్ దృష్ట్యా నిర్ణయాలు ● అభినందిస్తున్న మహిళలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పచ్చని పల్లెల్లో మద్యం ఏరులై పారుతుంది. తెల్లవారుజాము నుంచే బెల్టుషాపుల్లో మందుబాబుల అలజడి మొదలవుతుంది. రాత్రి పొద్దుపోయే వరకు మద్యం మత్తులోనే తూగుతున్నారు. ఈ మత్తులోనే గొడవలకు దిగుతున్నారు. దాడులకు దిగుతూ కేసుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త పాలకవర్గాలు మద్యం మత్తుకు చెక్ పెట్టేందుకు ముందుకొచ్చాయి. గ్రామాల్లో బెల్ట్షాపులు నిర్వహించొద్దని తీర్మానించి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇలాంటి గ్రామాలపై ప్రత్యేక కథనం.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా
గ్రామాల్లోని బెల్టుషాపుల్లో బూతుపురాణాలు, దాడులు చేసుకోవడం నిత్యకృత్యమయ్యాయి. సమీ పంలోని గృహాలవారు వీరి మాటలు వినలేక ఇ బ్బంది పడుతున్నారు. రాత్రి వేళ పెద్ద పెద్ద అరుపులు.. కేకలు వినిపిస్తుండడంతో భయాందోళన చెందుతున్నారు. మరికొన్ని గ్రామాల్లోనైతే రోడ్డుపైకి వచ్చి మూత్ర విసర్జన చేస్తుండడంతో సమీప ఇళ్లల్లో ఉండే మహిళలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్లో ఇటీవల ఓ బెల్టుషాపులో చిన్న బాలు అనే యువకుడు హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. కొన్ని రోజుల క్రితం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం శివారులోని కేశపెరుమాండ్ల ఆలయం పరిసరాల్లో కొందరు యువకులు మద్యం మత్తులో పరస్పరం దాడులకు తెగబడ్డట్లు సమాచారం. పచ్చని పల్లెల్లో బెల్టుషాపులు చిచ్చుపెడుతుండడంతో నూతన పా లకవర్గాలు ఆదర్శ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే గ్రామస్తుల సహకారంతో బెల్టుషాపులు నిర్వహించొద్దని తీర్మానాలు చేస్తున్నారు.
అమ్మితే జరిమానా.. సమాచారం ఇస్తే నజరానా
గ్రామాల్లో మద్యం అమ్మితే రూ.50వేలు జరిమానా విధిస్తామని గ్రామసభల్లో తీర్మానించారు. అంతేకాకుండా మద్యం విక్రయిస్తుండగా చూసి సమాచారం ఇచ్చిన వారికి రూ.25వేలు వరకు నజరానా ఇస్తామని ప్రకటించారు. దీని ద్వారా గ్రామాల్లో సంపూర్ణంగా మద్యం విక్రయాలు అరికట్టాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. తాజాగా జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి, తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లి, ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహించొద్దని నిర్ణయం తీసుకున్నారు.
‘బెల్టు’పై సమరం


