● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● గ్రామ పంచాయతీ అభివృద్ధి
ప్రణాళికపై సమీక్ష
కామారెడ్డి క్రైం: ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యానికి తావులేకుండా లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2026 – 27 రూపకల్పనలో భాగంగా, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పూరి గుడిసెల ప్రతిపాదనలు, ఉపాధి హామీ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణ అంచనాలు, వనమహోత్సవం ఏర్పాట్లు, ఎనఎఫ్బీఎస్, చేయూత పథకం, వర్షాకాల సన్నద్ధత, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వర్షాకాలంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచడంతోపాటు తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రెయినేజీ వ్యవస్థల నిర్వహణపై దృష్టి సారించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన పేద కుటుంబాలకు గృహాలు మంజూరు చేయడంలో భాగంగా గ్రామాల్లో ఉన్న పూరి గుడిసెలను క్షేత్రస్థాయిలో గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వనమహోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాల్లో చెత్త ట్రాక్టర్ల ద్వారా ప్రతిరోజూ చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో స్ధానిక సంస్ధల ఇన్చార్జి అదనపు కలెక్టర్ గిరి, హోసింగ్ పీడీ విజయపాల్రెడ్డి, డీపీవో మురళి, డీఆర్డీవో దామోదర్రెడ్డి, జెడ్పీ సీఈవో చందర్, సంబంధిత శాఖల అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
‘సర్’ హెల్ప్డెస్క్ ప్రారంభం
కామారెడ్డి క్రైం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) – 2026 కార్యక్రమంలో భాగంగా ప్రజల సందేహాలను నివృత్తి చేయడం కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు సులభంగా అందించేందుకు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 1950ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెవె న్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాజేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.


