● ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు
● బిచ్కుంద మున్సిపల్
కార్యాలయంలో సమీక్ష
బిచ్కుంద(జుక్కల్): పట్టణ అభివృద్ధికి బిచ్కుంద మున్సిపల్ అధికారులు, పాలకవర్గ సభ్యులు ప్రణాళిక రూపొందించాలని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ సీమ షెట్కార్ అధ్యక్షతన అధికారులు, కౌన్సిలర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పట్టణ అభివృద్ధికి నూతన బల్దియా కార్యాలయం, మురికి కాలువలు, కల్వర్టులు, సీసీ రోడ్లు, కాంప్లెక్స్ నిర్మాణానికి ఇతర అభివృద్ధి పనుల వివరాలను కమిషనర్ను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. మున్సిపల్ భవనం నిర్మాణానికి ఎకరన్నర భూమి కాకుండా భవిష్యత్తులో కార్యాలయం విస్తీర్ణానికి సరిపడా 5 ఎకరాలు భూమిని రెవెన్యూ అధికారులతో మాట్లాడి సేకరించాలని కమిషనర్ను ఆదేశించారు. పెట్రోల్ బంకుకు కేవలం రూ.150 పన్ను ఉందని కౌన్సిలర్లు సమావేశంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అభివృద్ధి కోసం ఆదాయం పెంచుకోవాలని సూచించారు. పాఠశాల భవనంలో బల్దియా కార్యాలయం కొనసాగుతుందని, విద్యార్ధులకు ఇబ్బందులు కలగకుండా అద్దైపె రూంలు తీసుకోవాలని, అద్దె తాను చెల్లిస్తానని ఎమ్మెల్యే సూచించారు. వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అన్నారు.
అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు..
అధికారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని, పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. పాలకవర్గం అధికారులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తుందన్నారు. 7వ వార్డులో కరెంటు సమస్య ఉందని, విద్యుత్ ఏఈ, కౌన్సిలర్ ముజాహిద్తో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కమిషనర్ను ఆదేశించారు. డంపింగ్ యార్డు నిర్మాణానికి రూ.40 లక్షలు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. అలాగే చెత్తతో ఎరువులు తయారీ అయ్యే విధంగా చూడాలని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, కౌన్సిలర్లు నౌషా నాయక్, కార్తిక, సందాని, కోఆప్షన్ సభ్యులు అసద్అలి, నాయకులు నాగ్నాథ్, విఠల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక
మద్నూర్ : గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే వెన్నెముక అని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని గురు ఫంక్షన్హాల్లో గురువారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పార్టీలో చిన్న పెద్ద తేడా లేదని, పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త సమానమేనని అన్నారు. పార్టీ సిద్ధంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమైన సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యకర్తలు, నాయకులు ఐకమత్యంగా ఉండి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు దరాస్ సాయిలు, నాయకులు హన్మండ్లుస్వామి, సంతోష్మేసీ్త్ర, గంగాధర్, దేవిదాస్పటేల్, రాంపటేల్ తదితరులు పాల్గొన్నారు.


