రామారెడ్డి: గుడిసెలు లేని జిల్లాగా మార్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. మంగళవారం ఆయన రామారెడ్డిలోని ఒడ్డెర కాలనీలో పర్యటించి గుడిసెలో నివసిస్తున్న కుటుంబంతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద 11 కేవీ విద్యుత్ వైర్లను తొలగించాలని గ్రామస్తులు కలెక్టర్ను కోరగా.. ఆయన విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
బడి ఈడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. మంగళవారం రామారెడ్డిలో బడి బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, ప్రతి చిన్నారికి విద్యను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా బడి బాట నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ బండి ప్రవీణ్, ఉపసర్పంచ్ నవీన్, తహసీల్దార్ ఉమాలత, ఎంపీడీవో నాగేశ్వరరావు, ఎంఈవో ఆనంద్రావు తదితరులు పాల్గొన్నారు.


