● నేడు ఘనంగా జరుపుకోనున్న ప్రజలు
● జిల్లావ్యాప్తంగా చేపలు,
మామిడి పండ్లకు పెరిగిన డిమాండ్
నిజామాబాద్ రూరల్: తొలకరి చినుకులు పడే మృగశిర కార్తె సోమవారం ఆరంభం అవుతుంది. సంప్రదాయం ప్రకారం మృగశిర కార్తె ప్రారంభమైన వెంటనే కొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాలు పడటం మొదలవుతుందని పెద్దలు చెబుతుంటారు. భారీ వర్షాలు సాధారణంగా మృగశిర రెండో వారంలో లేదా ఆరుద్ర కార్తె ప్రారంభానికి దగ్గరగా నమోదవుతుంటాయి. సూర్యుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో సూర్యుడు ఉండటం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు వచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం పేర్లతో పిలుస్తారు ఈ రోజున ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకుని సేవిస్తారు. మరికొందరు చేపలు ఆహారంగా తీసుకుంటారు. మామిడి పండ్లను కూడా తింటారు. మృగశిర కార్తె రోజు నుంచి వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యం చేయడానికి ఇంగువ బెల్లం, చేప మందు దోహదపడతాయని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో నగరంలో చేపల మార్కెట్, మామిడిపండ్ల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.


