● ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే
పరీక్ష కేంద్రాలుండాలి
● రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి
రామకృష్ణారావు
కామారెడ్డి క్రైం: త్వరలో నిర్వహించే నీట్–2026 కు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి అదనపు డీజీపీ మహేష్ భగవత్, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మాత్రమే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష నిర్వహణకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నపత్రాల రవాణా, అభ్యర్థుల నమోదు, బయోమెట్రిక్ ధ్రువీకరణ, తనిఖీలు, భద్రతా ఏర్పాట్లు తదితర విషయాల్లో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, అధికారులు పాల్గొన్నారు.


