మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం చీకట్లు కమ్ముకున్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడంతో 2 గంటల పాటు ట్రాన్స్కో అధికారులు సరఫరాను నిలిపివేశారు. దీంతో ఆస్పత్రిలో రోగులు చీకట్లో ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చిన రోగులకు కరెంట్ లేక.. ఫ్యాన్లు తిరగక, చీమ్మ చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. అర్ధరాత్రి ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన రోగులకు టార్చ్లైట్ వెలుతురులో వైద్యం అందించారు. విషయం తెలుసుకున్న వార్డు సభ్యులు నరేష్, తుకారం ఆస్పత్రికి వెళ్లి పరిశీలించారు. డ్యూటీలో ఉన్న నర్సులు, సిబ్బందికి లైట్, ఫ్యాన్ సౌకర్యం ఉంది.. రోగులకు మాత్రం ఏమీ లేదు. వైద్య సిబ్బంది ఉన్న చోట ఇన్వర్టర్ ఏర్పాటు చేసి రోగులు ఉన్న చోట ఏర్పాటు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తూ వారు ఆస్పత్రి సూపరింటెండెంట్ తీరుపై మండిపడ్డారు. అలాగే ఆస్పత్రిలో రాత్రి ఉండాల్సిన డ్యూటీ డాక్టర్ లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇంత పెద్ద ఆస్పత్రిలో కనీసం జనరేటర్ సౌకర్యం లేకపోవడం ఏమిటన్నారు. ఇప్పటికై నా ఆస్పత్రి సూపరింటెండెంట్, అధికారులు స్పందించి ఆస్పత్రిలో జనరేటర్ ఏర్పాటు చేయాలని కోరారు.


