కామారెడ్డి టౌన్: మండల పరిధిలోని గర్గుల్ గ్రామ వడ్లూరు శివారు వ్యవసాయ పొలాల్లో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. పొలాల మధ్య నుంచి వెళ్లే 11 కేవీ విద్యుత్ లైన్లకు సంబంధించిన వైర్లు భూమికి చాలా తక్కువ ఎత్తులో వేలాడుతుండటంతో రైతులు, కూలీలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పనులు చేసుకుంటున్నారు. విద్యుత్ స్తంభాలు వంగిపోయి, వైర్లు కిందికి జారిపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ పనులు ప్రారంభమవుతున్న తరుణంలో పొలాల్లో ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలు తిప్పాల్సి వస్తోందని, వైర్లు తక్కువ ఎత్తులో ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని రైతులు చెబుతున్నారు. అలాగే పొలాల గట్ల వెంబడి మేతకు వెళ్లే పశువులకు కూడా ఈ వైర్లు ముప్పుగా మారాయి. ఈ ప్రమాదకర పరిస్థితిపై గతంలోనే పలుమార్లు స్థానిక లైన్మాన్తో పాటు సంబంధిత విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే వైర్లను సరిచేయాలని గర్గుల్ గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు.


