లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపల్లి(ఖుర్దు) వద్ద పాముల వాగు వంతెన పునర్నిర్మాణానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు నిధులు మంజూరు చేయించడంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిరాంయాదవ్ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత సంవత్సరం భారీ వర్షాలకు వంతెన కొట్టుకుపోయిన విషయం విదితమే. ఈ క్రమంలో ఎమ్మెల్యే వంతెన నిర్మాణం కోసం రూ.4 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు.
పెద్దకొడప్గల్(జుక్కల్): ఈ విద్యా సంవత్సరం నుంచి పెద్దకొడప్గల్, కాస్లాబాద్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించబోతున్నట్లు బుధవారం ఎంఈవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఆయా పాఠశాలల్లో నాలుగు సంవత్సరాలు నిండిన చిన్నారులకు ప్రీ ప్రైమరీ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవచ్చని, విద్యార్థులకు ప్రత్యేక తరగతి గది, ఆట వస్తువులు, బొమ్మలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఆయా గ్రామాల్లోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.


