● రామారెడ్డి హైస్కూల్ గ్రౌండ్లో
మళ్లీ మొదలైన పంచాయితీలు
● ఇబ్బంది పడుతున్న క్రీడాకారులు
రామారెడ్డి(ఎల్లారెడ్డి): రామారెడ్డి జిల్లా పరిషత్ బా లుర, బాలికల ఉన్నత పాఠశాలలతో పాటు ప్రాథ మిక పాఠశాల మైదానం ప్రస్తుతం స్కూల్ గ్రౌండ్ లా కాకుండా రచ్చబండకు వేదికలా మారింది. పంచాయితీలకు అడ్డాగా తయారైంది. నిత్యం పదుల సంఖ్యలో ఇక్కడ పంచాయితీలు నిర్వహిస్తుండటంతో క్రీడాకారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండటమే శాపం..
రామారెడ్డి జీపీ భవనంలో తాత్కాలికంగా పోలీస్ స్టేషన్ను నిర్వహిస్తున్నారు. దీనికి ఎదురుగానే పాఠశాల మైదానం ఉంది. మండల వ్యాప్తంగా వివిధ కేసుల నిమిత్తం పోలీస్ స్టేషన్కు వచ్చే ఇరువర్గాల వారు.. ‘తామే మాట్లాడుకుంటాం‘ అంటూ బయటకు వచ్చి, నేరుగా స్కూల్ మైదానంలోకి చేరుకుంటున్నారు. అక్కడ గంటల తరబడి పంచాయితీలు పెట్టడం, ఒకరిపై ఒకరు గట్టిగా అరుస్తూ గొడవల కు దిగడం నిత్యకృత్యంగా మారింది. సోమవారం కూడా దాదాపు 100 మంది మైదానంలో చేరి పెద్ద ఎత్తున పంచాయితీ పెట్టారు.
గతంలో హెచ్చరించినా.. మళ్లీ మొదటికే!
ఈ సమస్యపై గతంలో ‘సాక్షి’ దినపత్రికలో ‘స్కూల్ మైదానమా.. పంచాయితీలకు అడ్డానా?‘ అనే శీర్షికతో కథనం ప్రచురించగా అప్పటి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి తీవ్రంగా స్పందించారు. పాఠశాల మైదానంలో ఎలాంటి పంచాయతీలను అనుమతించేది లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు. ఏఎస్పీ ఆదేశాలు ఇచ్చిన కొద్దిరోజులు పరిస్థితి బాగున్నా.. మళ్లీ ఇప్పుడు కథ మొదటికి వచ్చింది. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిత్యం మైదానంలో పంచాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


