కిక్కిరిసిన కాళేశ్వర క్షేత్రం, గణపేశ్వరాలయం
– మరిన్ని ఫొటోలు 8,9లోu
కాళేశ్వరం/గణపురం: మహా శివరాత్రి సందర్భంగా ఆదివారం కాళేశ్వరాలయం, గణపేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల భక్తులు తెల్లవారుజాము నుంచి త్రివేణి సంగమ గోదావరి, వీఐపీ ఘాటులో పుణ్యస్నానాలు చేసి సైకత లింగాలతో మొక్కులు చెల్లించారు. గోదావరి మాతకు దీపాలు వదిలి, దంపతి స్నానాలు చేశారు. శివసత్తుల పూనకాలతో హోరెత్తింది. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామివార్లకు గోదావరి జలాలతో అభిషేక పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన, సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. ప్రకారదేవతలకు మొక్కులు చెల్లించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు గోదావరి తీరం, ఆలయ పరిసరాలు, ఆలయంలోని క్యూలైన్లలో బారులుదీరారు. శివనామస్మరణతో కాళేశ్వరాలయం మారుమోగింది. పుర వీధులన్నీ భక్తజనంతో నిండిపోయాయి. రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం శ్రీశుభానంద ముక్తీశ్వరుల కల్యాణం, గోదావరిహారతి, తెప్పోత్సవానికి భక్తులు హాజరై భక్తిని చాటారు. అర్ధరాత్రి లింగోద్భవ పూజకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి బాలశివుడిని దర్శించుకున్నారు. భక్తులు జాగరణతో పాటు ఉపవాస దీక్షలను నియమ నిష్టలతో పాటించారు. ఆలయం ఆవరణలో రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు భద్రతా చర్యలు చేపట్టారు.
గోదావరిలో పుణ్యస్నానాలు..
ఆలయంలో అభిషేకాలు
తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తుల రాక
కిక్కిరిసిన కాళేశ్వర క్షేత్రం, గణపేశ్వరాలయం


