నేడు డయల్ యువర్ డీఎం
భూపాలపల్లి రూరల్: నేడు (శుక్రవారం) ఉదయం 11 గంటల నుంచి 12 గంటలకు వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిపో పరిధిలోని మండలాల ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినీయోగం చేసుకోవాలని కోరారు. 99592 26707కు ఫోన్చేసి అమూల్యమైన సలహాలు, సూచనలు అందించాలని డీఎం కోరారు.
కాళేశ్వరాలయంలో పూజలు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వొడ్డెపల్లి రామచందర్రావు, ఎలక్షన్ అబ్జర్వర్ గంగాధర్ గురువారం వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేసి శ్రీశుభానందదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి ఆశీర్వచన వేదిక వద్ద వారిని ఆలయ సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ సన్మానించారు. అర్చకులు తీర్థప్రసాదం అందజేశారు.
త్రివేణి సంగమంలో
హంసవాహనం
కాళేశ్వరం: ఈనెల 15న ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా రాత్రి ఏడు గంటలకు త్రివేణి సంగమంలో హంసవాహనంలో తెప్పోత్సవం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. గురువారం సాయంత్రం హంసవాహనం ఆకృతితో గోదావరిలో కూలీలు తయారు చేశారు. దీంతో సగం వరకు తయారైన హంసవాహనం పర్యాటకులు, భక్తులను ముచ్చట గొలుపుతుంది.
కాటారంలో 2కే రన్
మల్హర్(కాటారం): ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను పురస్కరించుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం కాటారం మండలకేంద్రంలో 2కే రన్ నిర్వహించారు. ఎస్బీఐ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు 2కే రన్ సాగగా కాటారం డీఎస్పీ సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. కేవైసీ మోసాల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. తెలియని సందేశాల లింక్లను ఓపెన్ చేయొద్దని పేర్కొన్నారు. ప్రతీ బ్యాంకు ఖాతాదారు కేవైసీ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ తిరుపతి, ఎస్సై శ్రీనివాస్, వివిధ బ్యాంకుల మేనేజర్లు ప్రవీణ్, హరిరాంనాయక్, సంతోష్, సికందర్, భాస్కర్, రవినాయక్ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరి మృతి
రేగొండ: మండలకేంద్రంలోని పరకాల–భూపాలపల్లి రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కోతులపురం గ్రామానికి చెందిన పొట్ట నరేష్ (25) ఇసుక లోడింగ్ కోసం మహదేవపూర్ వెళ్తున్నాడు. మండలకేంద్రంలోని సబ్స్టేషన్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ అతివేగంగా నరేష్ నడిపే లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేష్ క్యాబిన్లో ఇరుక్కుపోయి కాళ్లకు తీవ్ర గాయాలతో పాటు తల వెనుక తీవ్ర గాయమై అధిక రక్తస్రావం జరిగింది. చికిత్స కోసం 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.
నేడు డయల్ యువర్ డీఎం


