వాణిజ్య శాస్త్ర విభాగంలో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగంలో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణారావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కోర్స్ ద్వారా ట్యాలీ ప్రైమ్ (జీఎస్టీ) ఉపయోగించి వ్యాపార కౌంటింగ్, బిల్లింగ్ ఇన్వెంటరీ నిర్వహణకు సంబంధించి లావాదేవీలను సమర్ధవంతంగా నిర్వహించే విధానాన్ని శిక్షణార్థులు నేర్చుకుంటారని తెలిపారు. కోర్స్ పూర్తిచేసిన అభ్యర్థులకు జూనియర్ అకౌంటింగ్, అకౌంట్స్ అసిస్టెంట్, జీఎస్టీ అసిస్టెంట్ బిల్డింగ్ ఆపరేటర్ వంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక విధానాలకు, హక్కుల పరిరక్షణకు కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం ఏరియాలోని అన్ని గనుల వద్ద గేట్ మీటింగ్లు నిర్వహించి కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జేఏసీ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బొగ్గుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ, స్వదేశీ పెట్టుబడులను రద్దు చేయాలన్నారు. తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికే కేటా యించి, పర్మనెంట్ కార్మికులతోనే బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని తెలిపారు. ప్రతీ నెల మెడికల్ బోర్డు నిర్వహించి డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
● మద్దులపల్లిలో భయాందోళన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం మద్దులపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం దుమ్ముతో కూడిన సుడిగుండం సుమారు 45 నిమిషాల పాటు కనిపించి స్థానికుల్లో భయాందోళనలు సృష్టించింది. సాయంత్రం వేళ చేలల్లో పనుల నిమిత్తం వెళ్లిన పలువురు తిరిగి వస్తున్న క్రమంలో సుడిగుండాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా దుమ్ము గాలిలోకి ఎగసిపడటంతో పరిసర ప్రాంతమంతా దుమ్ము మేఘాలతో నిండిపోయింది. దృశ్యం భయానకంగా మారడంతో ఏం జరుగుతుందోనని భయపడ్డారు. మేడారం అడవుల్లో ఏర్పడ్డ టోర్నాడా లాంటిదని భయాందోళనకు గురయ్యారు. ప్రాణ, ఆస్తినష్టం, చెట్లు కూలడం జరగలేదని స్థానికులు తెలిపారు. కొద్దిసేపటి తరువాత సుడిగుండం అదుపులోకి రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో సుడిగుండం ఎగిసిపడ్డ వీడియోలు సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.


