గోశాలలో గో మహత్య ప్రవచనం
కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శివకృష్ణ గోశాలలో శనివారం గో మహత్య ప్రవచనం నిర్వహించారు. గోశాల నిర్వాహకులు లక్ష్మి,ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచకులు పాలెపు చంద్రశేఖర్ శర్మతో గోమాత ఆధ్యాత్మిక, వైదిక, సంస్కృతిక ప్రాధాన్యతపై భక్తులకు ప్రవచనాలు వినిపిస్తున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆదివారం (నేడు) ప్రవచన కార్యక్రమం ముగియనున్నా నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోకృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు తెలిపారు.
కొడుకు పుట్టిన సంబరం తీరక ముందే తండ్రి హఠాన్మరణం
● పదిహేనేళ్లకు సంతానం
కాళేశ్వరం: పెళ్లయిన పదిహేనేళ్లకు సంతానం కలిగింది. కొడుకు పుట్టిన సంబురంలో మునిగితేలిన ఆ తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. ఈ ఘటన కాళేశ్వరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మంచిర్యాల జిల్లా చెన్నూర్కు చెందిన పొన్నం వేణు (40), సంధ్యారాణి దంపతులు గత పన్నేండేళ్లుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో వాటర్ప్లాంట్, కూరగాయల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. వీరికి సంతానం లేక పదిహేనేళ్లుగా మనోవేదనకు గురయ్యారు. వారంరోజులక్రితం వీరికి కుమారుడు జన్మించాడు. దీంతో వారిద్దరి సంబరానికి అవధుల్లేవు. కానీ ఇంతలోనే విధి వక్రిరించడంతో వేణుకు షుగర్ లెవల్స్ బాగా పెరిగి కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శుక్రవారం చేరాడు. అక్కడే చికిత్సపొందున్న క్రమంలో శనివారం గుండెపోటుతో మృతి చెందాడని బంధువులు తెలిపారు. కొడుకు పుట్టిన ఆనందం, భార్య సంతోషం అన్నీ వేణు మృతితో ఆవిరైపోయాయి.
ఇస్రో సందర్శనకు ఎంపిక
చిట్యాల : మండలంలోని జూకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులకు ఈనెల 26న ఇస్రోను సందర్శించి, రాకెట్లను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కలిగినట్లు ప్రధానోపాధ్యాయుడు గిరగాని కృష్ణ శనివారం తెలిపారు. ఎన్నికై న విద్యార్థులను, ప్రధానోపాధ్యాయుడిని, ఉపాధ్యాయులను కలెక్టర్ రాహుల్ శర్మ అభినందించినట్లు పేర్కొన్నారు. అలాగే భూపాలపల్లి జిల్లాలోని మరిన్ని పాఠశాలల విద్యార్థులు కూడా సందర్శించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పెరిగిన గోదావరి వరద
మంగపేట : మండలంలో గోదావరి వరద నీటి మట్టం పెరిగింది. దీంతో గోదావరి ఒడ్డు వెంట చేపట్టిన కరకట్ట నిర్మాణ పనులు నిలిచి పోయాయి. కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం వద్ద గోదావరిపై నిర్మించిన సమ్మక్కసాగర్ బ్యారేజ్ ఎగువ ప్రాంతం నుంచి వరద ఇన్ఫ్లో పెరగడంతో శనివారం 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో గోదావరిలో వరద నీరు క్రమంగా పెరగడంతో సాయంత్రం వరకు కరకట్ట బండ్ పనులు జరుగుతున్న ప్రాంతంలోకి వరద నీరు చేరింది. పొక్లెయినర్ల చుట్టూ సైతం నీరు చేరడంతోపాటు బండ్ నిర్మాణానికి వినియోగించే రాళ్లు కూడా నీట మునిగి పనులు పూర్తిగా నిలిచి పోయాయి. ఇదే విషయంపై ఇరిగేషన్ ఏఈ వలీమ్మహ్మద్ను వివరణ కోరగా గోదావరిలో నీటిమట్టం పెరగడం వల్ల తాత్కాలికంగా పనులకు అంతరాయం కలిగిందన్నారు.
14,503 క్యూసెక్కుల నీరు విడుదల
కన్నాయిగూడెం : జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గోదావరిపై నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుంచి దిగువకు 14,503 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి 6,000 క్యూసెక్కుల ఉన్న నీరు శనివారం బ్యారేజ్లోకి ఒక్కసారిగా 14,750లకు వచ్చి చేరింది.
రామప్పను సందర్శించిన 13 దేశాల ప్రతినిధులు
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయాన్ని 13 దేశాలకు చెందిన 28 మంది ప్రతినిధులు శనివారం సందర్శించారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీ శిక్షణ పొందుతున్న లెబనాన్, టర్కీ, ఉజ్జెకిస్తాన్, జింబాబ్వే, ఈజిప్ట్, మొరా కో, ఇథియోపియా, టాంజానియా, లైబీరియా, మాలి, బోట్స్వానా, మారిషన్, గ్వాబెమాల దేశాలకు చెందిన 28 మంది ప్రతినిధులు కోర్స్ డైరెక్టర్ డాక్టర్ రావులపాటి మాధవి ఆధ్వర్యంలో రామప్పను సందర్శించగా అర్చకులు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు.
గోశాలలో గో మహత్య ప్రవచనం


