రేపు సీఎం బహిరంగసభ
గణపురం: గణపురం మండలం చెల్పూరు శివారులో ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న సీఎం రేవంత్రెడ్డి బహిరంగసభను విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. శుక్రవారం అధికారులతో కలిసి సీఎం బహిరంగ సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.
గణపురం: మండలకేంద్రంలోని కోటగుళ్లలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య పూజలో భాగంగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు జూలసల్లి నాగరాజు తీర్థ ప్రసాదాలు అందించారు.
చిట్యాల: మండలంలోని వెంచరామి శివారు పూరేడుగుట్ట వద్ద జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు. ఎండోమెంట్ ఈఓ మహేష్ , కార్యనిర్వహణ అధికారి ప్రసాద్, జాతర కమిటీ చైర్మన్ నాయిని స్వామి, కమిటీ సభ్యులు, పూజారుల ఆధ్వర్యంలో జాతరలో ఏర్పాటు చేసిన నాలుగు హుండీలను లెక్కించగా.. రూ.4లక్షల 50 వేల ఆదాయం లభించింది. టెండర్ల ద్వారా రూ.74వేలు, 1 గ్రామ్ బంగారం, 73 గ్రాముల వెండి వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాల్వపల్లి సర్పంచ్ పులి అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ కచ్చు మల్లేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, నాయకులు కచ్చు శ్రీనివాస్ పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులందరూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రచారానికి వినియోగించే వాహనాలకు సంబంధించి ముందుగా సంబంధిత మున్సిపల్ కమిషనర్ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో మైక్ పర్మిషన్, ర్యాలీ పర్మిషన్, బహిరంగ సభలకు సంబంధించిన అనుమతులు తప్పనిసరిగా పొందాలని స్పష్టంచేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభ్యర్థులందరూ ఎన్నికలు శాంతియుతంగా, నిబంధనల ప్రకారం జరిగేలా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.


