మూడోసారి మున్సిపోల్స్
● పరిశ్రమలతో దినదినాభివృద్ధి
● మండలం, నియోజకవర్గం, జిల్లా కేంద్రంగా మార్పు
● సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్,
మున్సిపల్లో బీఆర్ఎస్ హవా
● ఈసారి కోల్బెల్ట్ మొగ్గు ఎవరి వైపో..?
భూపాలపల్లి: నాడు కమలాపూర్ గ్రామ పంచాయతీలో కుగ్రామంగా ఉన్న భూపాలపల్లి అనతి కాలంలోనే మండల, నియోజకవర్గ, మున్సిపాలిటీ, జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకుంది. సింగరేణి గనులు, కేటీపీపీ పరిశ్రమలతో దినదినం అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి మున్సిపాలిటీలో ఇప్పటికే రెండుసార్లు ఎన్నికలు జరుగగా, త్వరలోనే మూడోసారి జరుగనుంది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి చరిత్ర, అభివృద్ధి, రాజకీయ పార్టీల బలాబలాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
బుర్ర, తిక్క కుటుంబాలదే హవా..
1981 నుంచి 2006 వరకు ఐదు సార్లు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇందులో భూపాలపల్లి గ్రామ మొదటి సర్పంచ్గా తిక్క వీరస్వామి ఏకగ్రీవం కాగా, అతని సోదరుడు తిక్క లింగమూర్తి ఒకసారి గెలుపొందారు. బుర్ర చంద్రయ్య రెండు పర్యాయాలు, అతని సతీమణి ఒక సారి సర్పంచ్గా విజయం సాధించింది. మొత్తానికి బుర్ర, తిక్క కుటుంబాలకు చెందిన నలుగురు వ్యక్తులే 26 ఏళ్ల పాటు సర్పంచ్లుగా కొనసాగారు. ఐదు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో ఈ రెండు కుటుంబాల వారు కాంగ్రెస్ మద్ధతుదారులుగానే నిలబడి గెలుపొందడం విశేషం.
గ్రామాల విలీనంతో నగర పంచాయతీగా..
2001 జనాభా లెక్కల ప్రకారం భూపాలపల్లి గ్రామ పంచాయతీలో కేవలం 15 వేలకు పైగా జనాభా ఉంది. నగర పంచాయతీ ఏర్పాటుకు సరిపడా జనాభా లేకపోవడంతో సమీపంలోని జంగేడు, వేశాలపల్లి, కాశీంపల్లి, పుల్లూరిరామయ్యపల్లి గ్రామ పంచాయతీలను భూపాలపల్లిలో విలీనం చేశారు. ఫలితంగా పట్టణ జనాభా 29 వేల పైచిలుకు చేరుకుంది. దీంతో 25 జనవరి 2012న భూపాలపల్లిని నగర పంచాయతీగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో జిల్లా కేంద్రంగా ఏర్పడిన భూపాలపల్లి పట్టణాన్ని 2017 ఆగస్టులో గ్రేడ్ 3 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మున్సి‘పోల్స్’లో కారుదే హవా..
భూపాలపల్లి మున్సిపాలిటీకి ఇప్పటి వరకు రెండు పర్యాయాలు ఎన్నికలు జరుగగా బీఆర్ఎస్ పార్టీనే సత్తాచాటింది. 2014లో జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ బండారి సంపూర్ణ రవి, 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అదే పార్టీకి చెందిన సెగ్గెం వెంకటరాణిసిద్ధు చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు.
ఈ సారి ఎవరి వైపో..
ఈ నెల 11న జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి పట్టణ ప్రజలు ఎవరి వైపు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. అధికారంలో ఉన్న ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ, కోల్బెల్ట్లో మరోమారు జెండా ఎగురవేయాలనే ఉద్ధేశంతో బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతున్నాయి. ఈ రెండు పార్టీలతో పాటు బీజేపీ తన ఉనికిని చాటుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. మొత్తంగా ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారనేది ఈ నెల 13న తేలనుంది.
విస్తీర్ణం 47.52
చదరపు కిలోమీటర్లు
వార్డులు 30
మొత్తం ఓటర్లు 52,726
పురుష ఓటర్లు 26,786
మహిళా ఓటర్లు 25,936
ఇతరులు 4
మూడోసారి మున్సిపోల్స్


