పురన్నాటకం
నేడు మున్సిపల్ చైర్మన్,
వైస్ చైర్మన్ ఎన్నిక
– మరిన్ని వార్తలు, ఫొటోలు II,IIIలోu
పోడియం వద్ద బైఠాయించిన కాంగ్రెస్, పలువురు స్వతంత్ర, సీపీఎం సభ్యులు, మద్దతుగా ఎంపీ
జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో హైడ్రామా
జనగామ: జనగామ పురపాలిక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సోమవారం నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడింది. మూడు రోజులుగా ప్రత్యేక క్యాంపుల్లో బస చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్ర సభ్యులు ఉదయం 11గంటలకు పోలీస్ ఎస్కార్ట్ నడుమ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం నుంచే ఇరు పార్టీలు రూట్మ్యాప్ మారుస్తూ హైటెన్షన్ పుట్టించారు.
ప్రక్రియ మొదలైయింది ఇలా..
భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి ఎక్స్అఫీషియో ఓటు హక్కుతో మొదట మున్సిపల్ కార్యాలయానికి రాగా.. అనంతరం బీఆర్ఎస్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి వెంట నడిచారు. జనగామ పురపాలిక కార్యాలయ సమావేశహాలులో పార్టీలు, స్వతంత్రుల వారీగా అక్షరమాలను అనుసరించి సభ్యులను కూర్చోబెట్టారు. ఓట్ల సమీకరణలో కాంగ్రెస్ పక్షాన ఇద్దరు స్వతంత్రులు, సీపీఎం కలిపి 15 మంది, బీఆర్ఎస్ 13మందితో పాటు మరో ఇద్దరు స్వతంత్రులతో 15 మంది ఉన్నారు. వీరికి ఎంపీ చామల, ఎమ్మెల్యే పల్లా ఎక్స్అఫీషియో ఓట్లు కలవడంతో ఇరువురూ చెరో 16 ఓట్లతో సమాన బలం కలిగివున్నారు. ఈ పరిస్థితులు ఉద్రిక్తతను రెట్టింపు చేశాయి.
సభ్యుల ప్రమాణం..
మొదటి ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో ఆర్డీఓ, ఎలక్షన్ అధికారి గోపిరామ్ సభ్యులచే ప్రమాణం చేయించి, మొదటి సంతకం పూర్తి చేయించారు. అనంతరం బీ–ఫామ్ ద్వారా ప్రకటించిన చైర్మన్ అభ్యర్థుల వివరాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ నుంచి 22వ వార్డు సభ్యురాలు కడకంచి బాలమణి శ్రీనివాస్, బీఆర్ఎస్ తరఫున 18వ వార్డు సభ్యుడు గోపగోని సుధాకర్ పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియ ఉదయం 11.45కు ముగిసింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నిక ప్రారంభిస్తున్నట్టు ఆర్డీఓ ప్రకటించగానే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి లేచి బీఆర్ఎస్ సభ్యురాలు హఫీజ్ ఫాతిమా కిడ్నాప్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదై దర్యాప్తు కొనసాగుతోందని, నిజాలు వెలుగుచూడకముందు ఎన్నిక నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. దానిపై అధికారులతో పదేపదే చర్చించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్కు మద్దతిస్తున్న 15వ వార్డు స్వతంత్ర సభ్యుడు మారబోయిన పాండు పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. వెంటనే కాంగ్రెస్ సభ్యులు, సీపీఎం, ఇద్దరు స్వతంత్రులు కలిసి పోడియం ముందు బైఠాయించి నినాదాలు మొదలుపెట్టారు. ఒక్క ఓటే భవిష్యత్తును నిర్ణయిస్తుంది.. నిజాలు బయటకు వచ్చే వరకు ఎన్నిక వాయిదా వేయాలంటూ నిరసన తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి దీనిని ఖండిస్తూ.. ఇది కిడ్నాప్ కాదు.. ఫేక్ కేసు..సభ్యురాలు, ఆమె భర్తతో సహా ఎవరూ కిడ్నాప్ కాలేదని చెబుతున్నారు... అనవసర డ్రామాలు ఆపాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాతిమాకు మద్దతుగా అదే పార్టీకి చెందిన సభ్యులు ఉడుగుల కిష్టయ్య, పానుగంటి సువార్త నిలదీశారు. అయినప్పటికీ పోడియం ముందు కాంగ్రెస్ నినాదాలు ఆగకపోవడంతో, అరగంట పాటు పరిస్థితిని గమనించిన తర్వాత ఎలక్షన్ అధికారి గోపిరామ్ ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నిక కొనసాగించడం సాధ్యం కాదని, నేటి(మంగళవారం)కి వాయిదా వేస్తున్నామని ప్రకటించి హాలు నుంచి వెళ్లిపోయారు.
మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను మంగళవారం నిర్వహించనున్నట్లు ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీఓ గోపిరామ్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో మధ్యాహ్నం 12.30గంటలకు ఎన్నిక నిర్వహించడం జరుగుతుందన్నారు. వార్డు సభ్యులందరితో పాటు ఎక్స్ఆఫీషియో సభ్యులు కూడా హాజరు కావాలని తెలిపారు. క్యాంపునకు వెళ్లిన ఇరు పార్టీల సభ్యులు, స్వతంత్రులు మళ్లీ రావాల్సి ఉంటుంది.
ఎన్నికల హాల్లో
సభ్యురాలి కిడ్నాప్ వివాదం
కేసు విషయమై ఎంపీ ఆబ్జెక్షన్..
దర్యాప్తునకు డిమాండ్
పోడియం ఎదుట నిరసనకు దిగిన
కాంగ్రెస్, స్వతంత్ర సభ్యులు
తాను కిడ్నాప్ కాలేదంటూ హఫీజ్ ఫాతిమా స్పష్టీకరణ
‘ఫేక్ కేసు.. నాటకాలు ఆపండి..’: ఎమ్మెల్యే పల్లా
గొడవల మధ్య ఎన్నిక నేటికి వాయిదా
కీలక మలుపు..కిడ్నాప్ కేసు విత్డ్రా!
తన సోదరుడు, మరదలు, కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను ఎమ్మెల్యే కిడ్నాప్ చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు అక్బర్ సోమవారం డీసీపీ, ఏఎస్పీకు లేఖ పంపించినట్లు సీఐకి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఫిర్యాదు వాస్తవాలకు విరుద్ధంగా, బయట వ్యక్తుల ప్రభావంతో, అపోహలతో చేసినట్లుగా చెప్పారు. ఇద్దరు వ్యక్తుల ప్రభావంతో ఇలా చేయాల్సి వచ్చిందని, ఇప్పుడు విషయాలు స్పష్టమవడంతో ఆ ఫిర్యాదును కొనసాగించేందుకు ఆసక్తిగా లేనని తెలిపారు. అపార్థాలు నివృత్తి కావడంతో అపహరణ జరిగినట్లుగా ప్రస్తావించిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. తదుపరి, తన పూర్వ ఫిర్యాదును ఉపసంహరించబడినదిగా పరిగణించి, తగిన విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ విషయమై సీఐ సత్యనారాయణరెడ్డిని అడుగగా ఉపసంహరణ ఫిర్యాదు వచ్చిందని, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత సాధ్యం కాదని, విచారణ చేస్తామని చెప్పడం జరిగిందన్నారు.
పురన్నాటకం
పురన్నాటకం


