ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ రూరల్: మున్సిపల్ ఎన్నికల విధులను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేశారు. తెలంగాణ మున్సిపాలిటీలు చట్టం 2019, రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, పోలింగ్ విధానాలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి పూర్తి బాధ్యతలు అధికారాలు తెలుసుకోవాలని, ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ ఒక మార్గదర్శకమన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని జనరల్ ఆబ్జర్వర్ నర్సింహరెడ్డి పరిశీలించారు. శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు మెరుగు రామరాజు, కె.సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


