తల్లికి వంచన
నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టారు. ఆనక తొలి ఏడాదికి ఎగనామం పెట్టి.. ఇప్పుడు మండలి వేదికగా తల్లికి వందనం అందరికి ఇచ్చామంటూ చంద్రబాబు ప్రభుత్వం అసత్యాలు వల్లించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లికి చెందిన కె. మరియమ్మ
తనయుడు ఇంటర్ చదువుతున్నాడు. తల్లికి వందనం పథకం కింద గత ఏడాది రూ.8,850 మాత్రమే అకౌంట్కు జమచేశారు. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వాటా అని, త్వరలో కేంద్ర ప్రభుత్వ వాటా జమవుతుందంటూ మెసేజ్ వచ్చింది. ఎనిమిది నెలలు కావస్తున్నా మిగిలిన సొమ్ము రాలేదని ఆమె తెలిపారు.
సాక్షి ప్రతినిధి,ఏలూరు: పేదరికం కారణంగా తమ బిడ్డలను చదువులకు దూరం చేయకూడదనే ఆశయంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పధకాన్ని అమలు చేసి తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున వేసి చరిత్ర సృష్టించారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని తల్లి వందనం పేరుతో మార్చి అమలుచేస్తామని, ఎంత మంది పిల్లలుంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఖాతాల్లో వేస్తామని హామీలు ఇచ్చారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను తుంగలోతొక్కి సాంకేతిక కారణాలను సాకుగా చూపి అనేక మంది తల్లులకు తల్లికి వందనం పథకం దూరం చేసి వెన్నుపోటు పొడిచారు.
అర్హులకు అందని సాయం
జిల్లాలో తల్లి వందనం పథకం అమలులో పక్షపాతం చూపడంతో అర్హుల్లో అనేక మందికి ఈ పథకం దూరమైంది. ఇద్దరు బిడ్డలున్న తల్లులు తమకు రూ.30 వేలు వస్తాయని ఎదురుచూడగా ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో కూటమి ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారు. కేవలం వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఈ పథకానికి దూరమైనట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు విద్యాశాఖ రికార్డుల ప్రకారం 2,72,135 మంది ఉండగా తల్లికి వందనం పథకం కేవలం 2,38,434 మందికి మాత్రమే అమలు చేస్తున్నారు.
మరో 33,701 మందికి ఈ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం దూరం చేసింది. దీనికితోడు పథకాన్ని అమలు చేసిన వారిలో సైతం ఎక్కువ మంది తల్లుల ఖాతాల్లో కేవలం రూ.8 వేల నుంచి రూ.10 వేలలోపు మాత్రమే వేయడంతో చంద్రబాబు చేతిలో తాము మరోసారి మోసపోయామని తల్లులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పథకం అందని వారిలో సుమారు 9 వేల మంది తమకు పథకాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. అయినప్పటికీ వారికి ఈ పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది తల్లులు పథకానికి దూరం కావడంతో ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లో ఈ విషయాన్ని సభ్యులు చర్చకు తీసుకురావడంలో మరోసారి తల్లికి వందనం పథకంపై రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
పూర్తి స్థాయి అర్హులకు దక్కని సాయం
సాంకేతిక కారణాలతో అందని తల్లికి వందనం
33,701 మందికి మొండిచేయి
గ్రీవెన్స్లో 9 వేల దరఖాస్తులు
జిల్లాలో 2.45 లక్షల మంది అర్హులు
గ్రీవెన్స్లో 9 వేల దరఖాస్తులు
తల్లికి వంచన


