ప్రాణాలైనా అర్పిస్తాం
● నేవీ ఆయుధ డిపో నిర్మాణం వద్దు
● పాలకుల కుట్రలు తిప్పికొడదాం
● మా భూములు ఇచ్చేది లేదు
ఏలూరు(టూటౌన్): నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి మా భూములు ఇవ్వం.. ప్రాణాలైనా అర్పిస్తాం.. నేవీ ఆయుధ డిపో నిర్మాణాన్ని అడ్డుకుంటామంటూ కొయ్యలగూడెం మండల ప్రజలు నిరసనగళం ఎత్తారు. కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, బర్కిత్నగర్లో నావిక ఆయుధ డిపో నిర్మాణం నిలిపివేయాలని, బలవంతపు భూసేకరణ విరమించాలని కోరుతూ శుక్రవారం ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద బోడిగూడెం, మంగపతి దేవి పేట, బర్కిత్ నగర్,రే గులకుంట, ఊట్లగూడెం గ్రామాల నుంచి ప్రజలు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి కలెక్టరేట్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, పలు ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ ధర్నాను ఉద్దేశించి అక్కినేని వనజ మాట్లాడుతూ జీలుగుమిల్లి మండలం వంకావారిగుడిలో నేవీ ఆయుధ డిపో పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నించిందని, వామపక్షాలు స్థానిక ప్రజలు సాగించిన పోరాటంతో అక్కడి నుంచి కొయ్యలగూడెం మండలం బోడిగూడెం కేంద్రంగా మంగపతి దేవి పేట, బర్కిత్ నగర్, రేగులకుంట, ఊట్లగూడెం పరిధిలో పెట్టాలని చూస్తుందని తెలిపారు. మండలంలోని ప్రజానీకం, రైతులు భూములు ఇవ్వం అని తేల్చి చెబుతున్నా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఆయుధ డిపో నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ నేవీ ఆయుధ డిపో నిర్మాణం పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, బలవంతపు భూసేకరణ తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. నేవీ ఆయుధ డిపో నిర్మాణం జరిగితే పచ్చని పొలాలలో వరి, మొక్కజొన్న, పొగాకు తదితర రెండు పంటలు పండే సారవంతమైన భూములు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు సంసాని కిషోర్, ఇళ్ల శ్రీరామమూర్తి, బలుసు నాగేశ్వరరావు మాట్లాడుతూ నేవీ ఆయుధం డిపో నిర్మాణంతో రెండు పంటలు పండే సారవంతమైన కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్వయంగా పంట పొలాలను సందర్శించి వాస్తవాలను పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, కౌలు రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ, కొయ్యలగూడెం మండలం కార్యదర్శి తాడిగడప ఆంజనేయరాజు, సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి అరటికట్ల రవి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి (అన్నే భవన్) కే. శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రాణాలైనా అర్పిస్తాం


