కలియుగ దైవంతో రాజకీయాలా ?
ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్
ఏలూరు టౌన్: టీడీపీ ప్రభుత్వం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామితో ఆటలాడుతూ.. నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ అన్నారు. శ్రీవారి పవిత్రత, లడ్డూ ప్రసాదం విశిష్టతను పరిరక్షించాల్సిన కూటమి ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయాల కోసం దేవుడితో రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని సీబీఐ, సిట్ దర్యాప్తులో తేలిపోయిందని, తాజాగా సీఎం చంద్రబాబు, కూటమి నేతలు మాట మార్చుతూ.. పామాయిల్, కెమికల్స్ కలిశాయని ఆరోపిస్తున్నారని తెలిపారు. వీటికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్ల నుంచి తీసుకున్న శాంపిల్స్పై చేసిన ల్యాబ్ పరీక్షల చుట్టూనే ఈ కేసు నడుస్తుందనే విషయాన్ని టీడీపీ, కూటమి నేతలు గమనించాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే శ్రీవారు లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం జరిగితే... దానికి బాధ్యత వహిస్తూ సమాధానం చెప్పాల్సింది టీడీపీ ప్రభుత్వమేనని తెలిపారు. ఈ టీడీపీ ప్రభుత్వం ఇప్పటికై నా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారితో రాజకీయాలు చేయకుండా... తప్పును ఒప్పుకోవాలని ఏలూరు సమన్వయకర్త జేపీ హితవుపలికారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ, అభిమానాన్ని చూసి భయంతో ఆయనపై కుట్రలు చేస్తున్నారని, దేవుడు కూటమి నేతలకు సరైన రీతిలో శిక్ష విధిస్తారని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, జిల్లా కార్యదర్శి కంచుమర్తి తులసీ, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, నగర దివ్యాంగుల విభాగం అధ్యక్షులు ఏ.కృష్ణ, తదితరులు ఉన్నారు.


