గిట్టుబాటు ధర లభించేనా?
సక్రమంగా అందని పంట సొమ్ము
గిట్టుబాటు ధర కల్పించాలి
సాగు విస్తీర్ణం తగ్గించాను
బుట్టాయగూడెం: ఒకప్పుడు ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న నాటు పొగాకు పంట సాగు క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. అధిక పెట్టుబడి, కూలీల కొరత, సాగులో ఆశించిన లాభాలు రాకపోవడం, తదితర కారణాలతో పంట తగ్గిపోతుందని రైతులు వాపోతున్నారు. ఒకప్పుడు వేలాది ఎకరాలుగా సాగైన నాటుపొగాకు ఇప్పుడు వందల ఎకరాలకే పరిమితమైంది. ముఖ్యంగా గత రెండు సంవత్సరాల నుంచి నాటు పొగాకుకు గిట్టుబాటు ధర తగ్గిపోవడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. గత ఏడాది 6 ఎకరాలు పంట వేసిన రైతు ఈ ఏడాది 3 ఎకరాలు మాత్రమే పంట వేశారు. ఆశించిన స్థాయిలో మార్కెట్ ధర లభించకపోవడంతో నాటు పొగాకును తగ్గించి వర్జీనియా పొగాకు, ఇతర పంటలవైపు మొగ్గు చూపుతున్నారు.
వైఎస్సార్ సీపీ హయాంలో...
2019 నుంచి 2024 వరకూ నాటు పొగాకు పంటల సాగు అధికంగా ఉండేది. సుమారు 2,500 ఎకరాల వరకూ మన్యప్రాంతంలో నాటుపొగాకు పంట పండించేవారు. నాటు పొగాకు పుట్టు 227 కేజీలు సుమారు రూ. 65 వేల నుంచి రూ.70 వేల వరకూ మద్దతు ధర వచ్చిందని, ఆ సమయంలో పంటల్లో లాభాలను కూడా చూశామని రైతులు చెబుతున్నారు. అలాగే పంటల సాగుకు కరెంట్ సదుపాయం కూడా సక్రమంగా ఉండడంతో నీటి కొరతకు కూడా ఇబ్బంది పడేవాళ్లం కాదని చెబుతున్నారు.
రెండేళ్లుగా దక్కని గిట్టుబాటు ధర
గడచిన రెండేళ్లుగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నాటు పొగాకు పుట్టు ధర రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ మాత్రమే వచ్చిందని, దీంతో తీవ్ర నష్టాల పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎకరం నాటుపొగాకు పంటకు తమకు రూ.1,50,000 వరకూ ఖర్చవుతుందని కనీస మద్దతు ధర రాకపోవడంతో ఈ ఏడాది సగానికి సగం పంట సాగు తగ్గించినట్లు చెబుతున్నారు. కాగా ఈ ఏడాది మన్యంలో కేవలం 600 ఎకరాల్లో మాత్రమే పంటలు వేసినట్లు రైతులు తెలిపారు.
నాటు పొగాకు సాగు చేసే రైతులకు విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ఆరుగాలం కష్టపడి పంటను పండించిన రైతు ఆ పంట అమ్ముకోవాలంటే నానా అవస్థలు పడుతున్నాడు. పంట కొనుగోలు చేసిన వ్యాపారులే ఆ పంటకు ధర నిర్ణయిస్తున్న పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా రైతుకు డబ్బులు చెల్లించే విషయంలో కూడా దళారుల నిర్ణయమే. అయితే రైతులు పండించిన పంటకు సొమ్ము ఎప్పుడు లభిస్తుందో కూడా తెలియని దుస్థితి నెలకొంటుంది. అవసరమైనప్పుడు ఆ వ్యాపారి దగ్గరకు వెళ్లి కొద్దికొద్దిగా సొమ్ము తెచ్చుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు.
గత రెండేళ్లుగా నాటు పొగాకుకు గిట్టుబాటు ధర లేదు. ఎంతోకాలంగా నాటు పొగాకు పండిస్తున్న మేము ఈ ఏడాది ఎంతో ఆశతో మళ్లీ నాటు పొగాకు పంట వేశాం. ఈసారైనా పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా అధికారులు కృషి చేయాలి. పంట పండించిన మాకు ఆ డబ్బులు కూడా సక్రమంగా చేతికి వచ్చే పరిస్థితి లేదు.
– కొప్పిశెట్టి కిషోర్, నాటు పొగాకు రైతు, కొమ్ముగూడెం
గత ఏడాది నేను 6 ఎకరాల్లో నాటుపొగాకు పంటను వేశాను. పుట్టు కేవలం రూ.30 వేలు మాత్రమే పలికింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో నాటు పొగాకు పుట్టు ధర రూ.70 వేల వరకూ వచ్చింది. గత రెండేళ్లుగా నాటుపొగాకుకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈ ఏడాది కేవలం 3 ఎకరాల్లో మాత్రమే పంట వేశాను.
– వల్లభనేని శివనాగరాజు, నాటు పొగాకు రైతు, కొమ్ముగూడెం
గత రెండేళ్లుగా నాటు పొగాకుకు దక్కని గిట్టుబాటు ధర
భారీగా తగ్గిన సాగు విస్తీర్ణం
600 ఎకరాల్లో సాగు చేస్తున్న చిన్న, సన్నకారు రైతులు
గిట్టుబాటు ధర లభించేనా?
గిట్టుబాటు ధర లభించేనా?


