ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేసి మోసం
● టీడీపీ నాయకురాలిపై చర్యలు తీసుకోవాలి
● ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ డిమాండ్
ఏలూరు (టూటౌన్): రైల్వే, పోస్టల్, కోర్టుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన కొయ్యలగూడెంకు చెందిన టీడీపీ మహిళా నాయకురాలిపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర చైర్మన్ ఐ.వేమేశ్వరి డిమాండ్ చేశారు. స్థానిక ఎన్ఆర్పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కొయ్యలగూడెంకు చెందిన టీడీపీ మహిళా లీడర్ గంగిరెడ్ల మేఘలాదేవి కొయ్యలగూడెం, కాకినాడ జిల్లా ఏలేశ్వరంనకు చెందిన పలువురు మహిళల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 2022–23 మధ్య కాలంలో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. బాధితులు తొమ్మిది మంది నుంచి రూ.90లక్షలు వసూలు చేసి తిరిగి చెల్లించమని అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. ఫేక్ శిక్షణ, ఫేక్ జాయినింగ్ ఆర్డర్లు ఇచ్చి బాధితులను మోసం చేశారని, అడిగితే తాను టీడీపీ నాయకురాలినని.. చేతనైంది చేసుకోండి ఆనడం, ఇంటికి వెళితే దౌర్జన్యం చేసి బెదిరించడం చేస్తున్నారన్నారు. బాధితులంతా నిరుపేదలని, వారు ఇండ్లు, స్థలాలు అమ్మి, అప్పులకు తెచ్చి సొమ్ములు చెల్లించారన్నారు. వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోగా డబ్బులు అడిగితే బెదిరించడం తగదన్నారు. దీనిపై బాధితులు ఏలూరు, కాకినాడ జిల్లాల కలెక్టర్లకు, పోలీసులతో పాటు మంత్రి నారా లోకేష్, డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు న్యాయం చేయకపోవడం బాధాకరమన్నారు. తక్షణం బాధితులకు న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో బాధిత మహిళలు పోలనాగమ్మ, అంబటి లవ లక్ష్మి, అనుమోలు పద్మావతి, సందక రమణమ్మ, ఏఐబీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


