మాట్లాడలేరు.. మంచం దిగలేరు
● 16 ఏళ్లుగా వైకల్యంతో బాధపడుతున్న హిమాని, జాను
● రూ.15 వేల పింఛన్ కోసం ఎదురుచూపు
లింగపాలెం: ఒకవైపు పుట్టుకతో వైకల్యం.. మరోవైపు పేదరికం. పుట్టినప్పటి నుంచి మంచానికే పరిమితమైన వారి జీవితాలు చూసేవారికి కన్నీళ్లు తెప్పిస్తాయి. లింగపాలెం మండలం బోగోలు గ్రామానికి చెందిన పరసా స్వామి, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె వెంకట హిమాని (16), కుమారుడు జాను(13)కు పుట్టుకతోనే అంగవైకల్యం. పూర్తిస్థాయిలో మంచానికే పరిమితమయ్యారు. మాట్లాడలేరు. అనేక ఆసుపత్రులకు తిప్పినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు సేవలు చేస్తూ పెంచుకుంటున్నారు. పిల్లలిద్దరికీ తీవ్ర అంగవైకల్యం ఉన్నప్పటికి హిమానికి మాత్రమే రూ.6 వేల పింఛన్ అందుతుంది. జానుకి పింఛన్ ఇవ్వడం లేదు. తమది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబమని, ఇద్దరూ కూలి పనులకు వెడితే గాని గడవదని.. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. భార్యాభర్తలిద్దరిలో ఒకరు పిల్లల వద్ద ఉండి బాగోగులు చూసుకోవాలి. ఒకరు ఇంట్లో పిల్లల దగ్గరుంటే మరొకరు కూలి పనులకు వెళ్తుంటారు. ఎన్టీఆర్ భరోసా కింద పూర్తి వైకల్యం ఉన్నవారికి రూ.15 వేల పింఛను అందజేసి ఆదుకోవాలని కోరుతున్నారు. కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని, అధికారుల చుట్టూ తిరగలేక మానేశామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ, మండల స్థాయి నాయకులను సంప్రదించినా ఫలితం లేదని వాపోతున్నారు.


