తాడువాయిలో 15 నుంచి శివరాత్రి తిరునాళ్ల
జంగారెడ్డిగూడెం: జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న, దక్షిణ కాశీగా పేరుగాంచిన జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 15 నుంచి 19 వరకు శివరాత్రి తిరునాళ్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. నిత్యపూజలతోపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఉత్సవాలు ఇలా...
● 15వ తేదీన ప్రాతఃకాలం నుంచే రుద్రాభిషేకాలు, విశేష పూజలు, స్వామివారి దివ్య మంగళ దర్శనం, ఉదయం 10 గంటల నుంచి విఘ్నేశ్వరుని పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అంకురార్పణ, ధ్వజారోహణ తదితర పూజలు నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు స్వామి వారికి, అమ్మవార్లకు ధూప సేవ, దీపాలంకరణ, నీరాజనం తదితర పూజలు నిర్వహిస్తారు. రాత్రి 11గంటలకు లింగోద్భవ దర్శన పూజలు జరుగుతాయి.
● 16వ తేదీన శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి వారి గ్రామోత్సవం, స్వామి వారికి, అమ్మవారికి అభిషేకాలు, నిత్య పూజలు నిర్వహిస్తారు.
● 17వ తేదీన నిత్య పూజలతోపాటు ఉదయం 10 గంటలకు భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవం, అనంతరం భారీ అన్నసమారాధన నిర్వహిస్తారు.
● 18వ తేదీ ఆలయ సమీపంలో ఉన్న శ్రీ అప్పన్న సమేత అనంతేశ్వరస్వామి వారి ఆలయంలో స్వామి వారికి దివ్య కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు.
● 19వ తేదీన నిత్యపూజలతోపాటు రాత్రి 8 గంటలకు స్వామి వారికి, అమ్మవారికి శ్రీ పుష్పయాగం (పవళింపు సేవ) జరుగుతుంది.
ఏర్పాట్లు పరిశీలించిన ఏఎస్పీ
తాడువాయిలో 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లను జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు, భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఎర్రకాలువ జలాశయానికి భక్తులు లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గజ ఈతగాళ్ళను కూడా ఏర్పాటు చేయాలన్నారు. సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్వీ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఉత్సవ కమిటీ ఛైర్మన్ ఉప్పునూతల పుల్లారావు, పాపోలు వెంకట శ్రీనివాస్, రూప సత్యసాయి సుధాకర్, కొడవటి సత్తిరాజు, కాసారపు వెంకటరమణ, పొన్నగంటి మహి, కాసారపు నారాయణ, భక్తుల అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు అధికారులకు వివరించారు.
తాడువాయిలో 15 నుంచి శివరాత్రి తిరునాళ్ల
తాడువాయిలో 15 నుంచి శివరాత్రి తిరునాళ్ల


