వినయంతోనే విద్యకు విలువ
ఎంతో పేదరికంలో పుట్టి కష్టపడి చదువుకొని దేశ రక్షణ రంగంలో అనేక సంచలనాలకు బిందువైన అబ్దుల్కలాం, తెలుగు సంగీతంలో చిరఃస్థాయిగా నిలిచిన ఘంటసాల వెంకటేశ్వరరావుల జీవిత చరిత్రను, వైద్యరంగంలో ఎంతో కృషి చేసిన ఎల్లాప్రగడ సుబ్బారావు వంటి వారు తమ జీవితంలో కష్టాలు పడి గొప్పవారిగా ఎదిగిన విధానాన్ని విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్ధి అబ్దుల్ కలాం రాసిన పాత్ వే టూ గ్రేట్నెస్ పుస్తకాన్ని చదవాలని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురవకుండా ఉండాలంటే మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ ప్రారంభోపన్యాసం చేస్తూ మంచి విషయాలను విని విద్యార్థులు తమను తాము సరిదిద్దుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. అనంతరం డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఏఓ బీ లక్ష్మణరావుల, డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి చాగంటి కోటేశ్వరరావు దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించి వీణను బహూకరించారు. పలువురు విద్యార్థులు చాగంటి కోటేశ్వరరావు ముఖచిత్రాన్ని పెన్సిల్ ఆర్ట్తో గీసిన చిత్రపటాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్జీయూకేటీ డీన్ అకడమిక్స్ దువ్వూరు శ్రావణి, ఫైనాన్స్ ఆఫీసర్ శ్రీనాథ్, డీఎస్డబ్ల్యూఓలు రాజేష్, దుర్గాభవాని, చీఫ్ వార్డెన్ బీ సురేష్, పీఆర్వో జడా సుబ్బారావు, పలువురు ఫ్యాకల్టీ తదితరులు పాల్గొన్నారు.
నూజివీడు: విద్యచేత వినయం కలిగినప్పుడే ఆ విద్యకు విలువ ఉంటుందని ప్రముఖ ప్రవచనకారుడు, నైతిక విలువల ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆదివారం విద్యార్థుల్లో నైతిక విలువలు అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత కార్యక్రమాన్ని జ్యోతీప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులనుద్ధేశించి మాట్లాడుతూ విద్యార్థులంతా ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు బాధపడేలా ప్రవర్తించకూడదన్నారు. చదువుకున్న వాడికి మాత్రమే ఓర్పు వస్తుందని, ఓర్చుకోగలిగిన వాడే వృద్ధిలోకి వస్తారన్నారు. తాను భరించడం, ఇతరుల్ని క్షమించడం అనే లక్షణాల్ని విద్యార్థులు అలవర్చుకోవాలని, కష్టాలను భరించలేక ఆత్మహత్యకు పాల్పడడం కాకుండా కష్టాల నుంచి పట్టుదలను అలవాటు చేసుకోవాలని సూచించారు. మనకందరికి తెలిసింది సముద్రంలో బిందువుతో సమానమని, మనం తెలుసుకోవలసిన విషయాలు లోకంలో ఎన్నో ఉన్నాయన్నారు. ఎప్పుడూ తన గురించే కాకుండా లోక సంక్షేమం కోసం కూడా ఆలోచించాలన్నారు.
మంచి పుస్తకాలు చదవాలి
ప్రముఖ ప్రవచన కర్త, ప్రభుత్వ సలహాదారు
చాగంటి కోటేశ్వరరావు