సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
ఏలూరు (టూటౌన్): మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలో శనివారం సాయంత్రం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యాలయం వద్ద ప్రారంభమై కొత్త బస్టాండ్, ఫైర్ స్టేషన్ సెంటర్, విజయ విహార్ సెంటర్, రమా మహల్ సెంటర్, రైల్వే స్టేషన్ పాత బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎంఎస్ఆర్యు రాష్ట్ర ఉప ప్రధానకార్యదర్శి వీవీఎన్ ప్రసాద్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం దుర్మార్గమన్నారు. లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలను కార్పొరేట్లకు కారుచౌకగా మోడీ ప్రభుత్వం అప్పగిస్తుందని వారు తెలిపారు. అందులో భాగంగానే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎం.ఇస్సాక్, వైఎస్ కనకారావు, జె.గోపి, పి.రవికుమార్, ఎస్కె.షమీమా, జాన్ బాబు, కుమార్, తదితరులు పాల్గొన్నారు.


