చట్టాల అమలులో నిర్లక్ష్యం తగదు
బుట్టాయగూడెం: గిరిజన చట్టాల అమలులో నిర్లక్ష్యం ఆపాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు హెచ్చరించారు. మండలంలోని ఇనుమూరులో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు శుక్రవారం జరిగాయి. ఆదివాసీలు, గిరిజన చట్టాలు అంశంపై శిక్షణ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం గిరిజనులకు ఇచ్చిన హక్కులు, ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల భూములు, అటవీ వనరులు, జీవనాధారాన్ని కాపాడే చట్టాలు కాగితాలకే పరిమితం కావడం బాధాకరమన్నారు. గిరిజన చట్టాలు అమలులో విఫలమైతే గిరిజన సమాజం సంఘటితంగా పోరాట పథంలో నడవడం తప్ప మరో మార్గం ఉండదని హెచ్చరించారు. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో ఆదివాసీలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఏ.అశోక్, మొడియం నాగమణి, తెల్లం రామకృష్ణ, ధర్ముల రమేష్, పోలోజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


