శ్మశాన కొల్లలో అంకాళమ్మ ఆగ్రహం!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మహా శివ రాత్రి మరుసటి రోజు చిత్తూరు నగరంలోని నీవానది ఒడ్డున్న మయాససేవను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి అదేమాదిరిగా సంప్రదాయం ప్రకారం గురప్ప్రనాయుడు వీధిలోని శ్రీ అంకాళపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పుష్పాలతో అలంకరించిన ప్రభపై అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చి...నీవా నది ఒడ్డున ఏర్పాటు చేసిన శ్మశానకొల్ల మైదానానికి చేర్చారు. అక్కడ అమ్మవారు ప్రదక్షిణలు చేయడంతో దక్ష సంహారం ప్రారంభమైంది.
దక్షుడిపై దేవీ ఆగ్రహం
మట్టితో తీర్చిదిద్దిన భారీ దక్షుడి ప్రతిమకు భక్తులు పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు. కర్పూరహారతులతో ప్రార్థనలు చేశారు. అమ్మవారి ప్రతిమ చుట్టూ ప్రదక్షిణలు చేయగానే దక్ష సంహారం ముగిసింది. అనంతరం పవిత్ర మట్టి కోసం భక్తులు ఒక్కసారిగా ఎగబడడం ఉత్సాహాన్ని చాటింది. హారతి, నిమ్మకాయ కోసం కూడా భక్తులు పోటీపడ్డారు.
జనంతో కిక్కిరిసిన ప్రాంగణం
మైదానం నిండిపోవడంతో కాలువ గట్టు, గోడలు, భవనాలపై నుంచి కూడా భక్తులు వీక్షించారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఊరేగింపు ముగిసే వరకు పర్యవేక్షించారు. నిర్వాహకులు కేఎం.కుమార్ మాట్లాడుతూ 193 ఏళ్లుగా ఈ మయానసేవ కొనసాగుతోందన్నారు. అమ్మవారి దర్శనంతో కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న విజయానందరెడ్డి
అంకాళపరమేశ్వరి అమ్మవారిని వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆయనకు కర్పూర హారతి అందించారు. అమ్మవారి దర్శనానంతరం దుశ్శాలువతో సన్మానించి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శ్మశానకొల్లలో అంకాళపరమేశ్వరి
అంకాళపరమేశ్వరిని దర్శించుకుంటున్న విజయానందరెడ్డి
చిత్తూరు నగరంలో సోమవారం జరిగిన శ్మశానకొల్ల(మయానసేవ) ఉత్సవం జాతరను తలపించింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు మండుటెండను లెక్కచేయకుండా గంటల తరబడి వేచి ఉండి అమ్మవారిని దర్శించి తన్మయత్వంతో ఉప్పొంగిపోయారు. పలువురు భక్తులు పూనకాలతో ఊగిపోయారు.
శ్మశాన కొల్లలో అంకాళమ్మ ఆగ్రహం!


