దళారులదే రాజ్యం
లంచమిస్తే సరి.. లేకుంటే చుక్కలే
ఆపసోపాలు పడుతున్న సామాన్యులు
కొత్త జేసీకి అగ్నిపరీక్ష!
ప్రక్షాళన చేయాలంటున్న జిల్లా ప్రజానీకం
రెవెన్యూలో..
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా రెవెన్యూ శాఖ సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. సామాన్యుడి భూమి హక్కు పత్రం కావాలన్నా, చిన్నాచితకా తప్పుల సవరణ జరగాలన్నా ‘కాసులు’ కురిపించాల్సిందే. రెవెన్యూ కార్యాలయాలు ప్రజాసేవా కేంద్రాలుగా కాకుండా, భూ సెటిల్మెంట్ అడ్డాలుగా మారుతున్నాయి. నూతనంగా విధుల్లో చేరిన జాయింట్ కలెక్టర్కి కేవలం పెండింగ్ ఫైల్స్ మాత్రమే కాదు... దశాబ్దాలుగా పాతుకుపోయిన ఒక అవినీతి నెట్వర్క్ని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
మూడంచెల దోపిడీ
మ్యూటేషన్ ప్రక్రియలో క్లియర్ అని ఉన్న ఫైళ్లు తహసీల్దార్ లాగిన్లో వారాల తరబడి ఎందుకు మగ్గిపోతున్నాయో తెలియడం లేదు?. దీని వెనుక ఉన్నది కృత్రిమ జాప్యం. బాధితుడు విసిగిపోయి మధ్యవర్తిని ఆశ్రయించే వరకు ఫైలు ముందుకు కదలదు. ఒక్కసారి డీల్ కుదిరితే చాలు.. అర్ధరాత్రి సమయంలో కూడా గుట్టుచప్పుడు కాకుండా డిజిటల్ సంతకాలు చేయడం ఇక్కడ ప్రత్యేకత.
వెబ్ల్యాండ్ మాయాజాలం
రికార్డుల ప్రక్షాళన పేరుతో జరుగుతున్న తంతు సామాన్యుడికి శాపంగా మారింది. ఉన్న భూమిని ఆన్లైన్ నుంచి తొలగించడం, లేని భూమిని ఉన్న ట్లు చూపడం వంటి అక్రమాలు కంప్యూటర్ ఆపరేటర్ల స్థాయిలోనే సాగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయాల్లో అవుట్సోర్సింగ్ సిబ్బందికి అసలు అధికారుల కంటే ఎక్కువ పట్టు ఉండడం వెనుక ఉన్న మర్మమేమిటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
దిగజారిన ‘రెవెన్యూ’
జిల్లాలోని కొన్ని మండలాల్లో దళారులకు తెలియకుండా తహసీల్దార్ సంతకం చేయని పరిస్థితికి వ్యవస్థ దిగజారిందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయం బయట ఉండే టీ కొట్టు దగ్గర నుంచి జిరాక్స్ సెంటర్ల వరకు ప్రతి చోటా ఒక రెవెన్యూ ఏజెంట్ జిల్లాలో దర్శనమిస్తున్నారు.
తహసీల్దార్ కార్యాయాల్లోనే అక్రమార్కులు
పీజీఆర్ఎస్లో రెవెన్యూదే అగ్రస్థానం
ప్రతి సోమవారం కలెక్టరేట్ వేదికగా జరిగే ప్రజా ఫిర్యాదుల వేదికలో వచ్చే దరఖాస్తులను పరిశీలిస్తే, 75 శాతం కంటే ఎక్కువ రెవెన్యూ విభాగానికి చెందినవే ఉంటున్నాయి. ఈ వేదికలో నమోదయ్యే అర్జీలను క్షేత్రస్థాయి అధికారులు పరిశీలించకుండానే తప్పుడు రిపోర్టులు అందజేస్తున్నారు. ఒకే దరఖాస్తుదారుడు పీజీఆర్ఎస్కు పది సార్లు వస్తున్నాడంటే క్షేత్ర స్థాయిలో పని జరగడం లేదని స్పష్టమవుతోంది.


