ప్రతిమలతో భక్తిఫలం
ప్రతి సంవత్సరం వచ్చే మహాశివరాత్రి పర్వదినం అతనికి కేవలం ఒక పండుగ కాదు. అది ఆత్మానుభూతి, ఆరాధన, ఆత్మసాధనల సమ్మేళనం. శివరాత్రి వస్తుందంటే అతను భక్తి పారవశ్యంతో మునిగిపోతాడు. ఆ ఆరాధననే కళారూపంగా మలిచి శివప్రతిమలను సృష్టిస్తాడు. పదహారేళ్లుగా ప్రతి శివరాత్రికి వినూత్న శివప్రతిమలు, ప్రత్యేక లింగాకారాలను రూపొందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు నగరి మున్సిపాలిటీ కీళపట్టుకు చెందిన గణేశ్.
నగరి: నగరి మున్సిపాలిటీ కీళపట్టుకు చెందిన సుబ్రమణ్యం కుమారుడు గణేశ్. తండ్రి వారపు సంతలో కూరగాయలు అమ్ముతూ స్థానికంగా ఉన్న త్రిపురసుందరీ సమేత చంద్రమౌళీశ్వర ఆలయంలో నిత్యపూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. తండ్రితోపాటు తరచూ ఆలయానికి వెళ్లే గణేశ్కు శివారాధనపై మక్కువ పెరిగింది. దీంతో శివరాత్రి రోజు విన్నూత్న వస్తువులతో తనే శివాకారాన్ని సృష్టించి, ఆరాధించాలనుకున్నాడు. అతని ఆలోచనకు తల్లిదండ్రులు సహకారం అందించారు. దీంతో పదిహేనేళ్ల క్రితం శివరాత్రిని పురస్కరించుకొని ఆల యం సమీపం పరమేశ్వరుని ప్రతిమలు చేయడం మొదలుపెట్టారు. మట్టి, రాళ్లు, ఆకులు, నార, గవ్వలు, రుద్రాక్షలు, టెంకాయలు ప్రకృతిలో లభించే పదార్థాలు అతని చేతిలో ఆధ్యాత్మిక రూపాన్ని దాల్చింది. ప్రతి ప్రతిమలో భక్తి, నైపుణ్యం, సృజనాత్మకత కలగలిపి కనిపించింది. శివరాత్రి నా కోసం ఒక ఆధ్యాత్మిక యాత్ర. ప్రతి ప్రతిమ నా భక్తికి ప్రతిబింబం, అని అతను వినమ్రంగా చెబుతాడు. అతను రూపొందించే లింగాకారాల్లో ప్రత్యేక ఆకృతులు, శైవ తత్వాన్ని ప్రతిబింబించే చిహ్నాలు ఉంటాయి. దీంతో భక్తులు, స్థానికులు ఆయన ప్రతిమలను ఆసక్తిగా వీక్షిస్తూ అభినందిస్తున్నారు. ప్రతి ఏడాది కొత్త ఆలోచనతో, కొత్త రూపంతో శివప్రతిమలను ఆవిష్కరించడం అతని ప్రత్యేకత. ఇది కేవలం కళ కాదు శివారాధన అని చెప్పే అతనికి శివరాత్రి అంటే ఆత్మసంతృప్తి. భక్తి, కళ, వినూత్నం కలిసినప్పుడు పుట్టేది ఇలాంటి ప్రతిభే అని స్థానికులు ప్రశంసిస్తున్నారు. స్థానిక యువకులు కూడా ఇతన్ని అనుసరిస్తూ ప్రతిమల తయారీలో సహకారం అందిస్తున్నారు. పలు ఆలయాలకు సంబంధిత కాంట్రాక్టు పనులు చేస్తూ శివరాత్రి పర్వదినానికి రెండు నెలలకు ముందు నుంచి శివప్రతిమలు చేసి అందరినీ అలరిస్తూ పదహారేళ్లుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మరెన్నో సంవత్సరాలు కొనసాగాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఈ ఏడాది శివరాత్రిని పురస్కరించుకొని అతను సిద్ధం చేసిన శ్మశానాధీశుడు, జ్యోతిర్లింగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
2021లో రుద్రాక్షలతో ఆనందతాండవం
ఈ ఏడాది శ్మశానాధీశుని ప్రతిమ
ప్రతిమలతో భక్తిఫలం
ప్రతిమలతో భక్తిఫలం
ప్రతిమలతో భక్తిఫలం


