30 స్టార్టర్లు చోరీ
పుత్తూరు: పట్టణ పరిధిలోని తిమ్మాపురం, కట్టకింద రామకృష్ణాపురం, కొత్తతిమ్మాపురం, కొండల్చెరువు గ్రామాల్లోని పలువురు రైతులకు చెందిన 30కి పైగా స్టార్టర్లు, వందల మీటర్ల కాపర్ వైర్ను దుండగులు గురువారం రాత్రి దోచుకెళ్లారు. శుక్రవారం పొలాల వద్దకు వెళ్లిన రైతులకు మోటార్ల వద్ద తెగి పడిన వైర్లతో పాటు స్టార్టర్లు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి పరుగులు తీశారు. పంట పొలాలకు నీళ్లు ఎలా కట్టాలంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయా గ్రామాలకు చెందిన రైతులు కలసి వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కో రైతు కనీసం రూ.10 వేలు ఖర్చు పెడితేగాని స్టార్టర్, వైర్లను ఏర్పాటు చేసుకొనే పరిస్థితి లేదు. పోలీసులు ఈ వరుస దొంగతనాలను అరికట్టడానికి తగిన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఈ మేరకు కట్టకింద రామకృష్ణాపురానికి చెందిన మురళీ, తిమ్మాపురంలో గాంధీ, కృష్ణారెడ్డి, శంకర్రెడ్డి, జగదీష్, నాగరాజురెడ్డి, గంగయ్యరెడ్డి, పంచాక్షరరెడ్డి, ఏలుమలైరెడ్డి, కొత్తతిమ్మాపురంలో కందస్వామి తదితర రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.
30 స్టార్టర్లు చోరీ


