రెండిళ్లకే సీసీ రోడ్డు
శ్రీరంగరాజపురం: మండలంలోని పొలంలో ఇద్దరు టీడీపీ నాయకులు నిర్మించుకున్న రెండు ఇళ్లకే దాదాపు రూ.14 లక్షలతో సీసీ రోడ్డు వేశారు. పొలంలోని ఓ ఇంటికి రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం స్థానికులు అడ్డుకున్నారు. స్థానికుల కథనం మేరకు శ్రీరంగరాజపురం మెదవాడ ఎస్టీ కాలనీలో ప్రభుత్వ నిధులతో చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారి నుంచి పొలంలో ఇళ్లు నిర్మించుకున్న ఇంటి వరకు దాదాపు రూ.3 లక్షలతో కల్వర్టు, రూ.4 లక్షలతో సీసీ రోడ్డు, రూ.2 లక్షలతో కాలువ ప్రొటక్ట్ వాల్ నిర్మాణం చేపట్టారు. పొలంలో నిర్మించుకున్న ఇంటికి దాదాపు రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులను శుక్రవారం ప్రారంభించారు. మెదవాడ పంచాయతీలో దళితవాడ, ఎస్టీ కాలనీలకు రోడ్లు వేయలేదని, ఇద్దరి ఇళ్లకు మాత్రం రోడ్లు వేయడం ఏమిటని స్థానికులు అడ్డుకున్నారు.
సాక్షి విలేకరిపై దౌర్జన్యం
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సాక్షి మండల విలేకరి సెల్ఫోన్లో రోడ్డు నిర్మాణ పనులను చిత్రీకరించి అధికారులకు తెలియజేశారు. దీనిపై కాంట్రాక్టర్ జ్యోతిప్రకాష్ నాయుడు, అతని సోదరుడు సాక్షి విలేకరిని దుర్భాషలాడాడు. కులం పేరుతో దూషించి, దాడికి యత్నించారు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.


