కదం తొక్కిన కార్మికులు
జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ లేబర్స్కోడ్ రద్దు చేయాలని డిమాండ్ వైఎస్సార్టీయూసీ మద్దతు
చిత్తూరు కార్పొరేషన్: దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా శ్రామిక సంఘాల నాయకులు, కార్మికులు కదం తొక్కారు. గురువారం జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. పలు కార్మిక, వామపక్ష, రైతు సంఘాల నాయకులు పాల్గొని ఆందోళన చేపట్టారు. దీనికి వైఎస్సార్టీయూసీ మద్దతు పలికింది. మిట్టూరులోని మున్సిపల్ పార్క్ వద్ద నుంచి గాంధీవిగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి తమ డిమాండ్లు పరిష్కారించాలని నినాదాలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ.రామానాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి గంగరాజు, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు చాన్బాషా, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నట్టు తెలిపారు. కార్మిక చట్టాలను, హక్కులను మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. బడా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం స్కీము వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వామపక్షాల నాయకులు గోపీనాథ్, మణి, రమాదేవి, విజయగౌరీ, కుమారి, బ్యాంక్ కార్మికుడు శేఖర్, అంగన్వాడీ నుంచి ప్రేమ, షకీలా, ప్రభావతి, ఆశ గంగాభవాని, ఆటో యూనియన్ నుంచి విజయ్కుమార్, రఘు, రవి, మున్సిపల్ కార్మికుల నుంచి జయశంకర్, సుగుణ, వాసు, సుకన్య రమణి, సురేష్ సివిల్ సప్లయ్ నుంచి కృష్ణ, ఐఎంఎఫ్ఎల్ చంద్ర, మెడికల్ ఉద్యోగుల సంఘం నుంచి మణికంఠ, సుగుణ వాసు, సురేష్, రమణి, రాజారాం, మధ్యాహ్న భోజనం నుంచి జయలక్ష్మి, హమాలి యూనియన్ నుంచి కమల్, నాగరాజా, బిల్డింగ్ వర్కర్స్ నుంచి మునుస్వామి, జయరాం పాల్గొన్నారు.
ర్యాలీగా వస్తున్న పలు సంఘాల కార్మిక నాయకులు, కార్మికులు
మద్దతు తెలిపిన వైఎస్సార్టీయూసీ నాయకులు
కదం తొక్కిన కార్మికులు


