నులి పురుగుల నిర్మూలనకు సన్నద్ధం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో 21వ జాతీ య నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి బుధవారం వైద్యాధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాల ను క్షేత్రస్థాయి సిబ్బంది, మండల స్థాయి లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో పంచుకోవాలని సూచించారు. ఈనెల 17వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. జిల్లాలో 1–19 ఏళ్లలోపు మొత్తం 3,62,535 మంది పిల్లలు, యువతకు ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇందులో 1–5 ఏళ్లలోపు 77,318 మంది చిన్నారులు ఉండగా, ప్రభు త్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతు న్న 2,84,060 మంది విద్యార్థులు ఉన్నారు. బడి బయట ఉన్న 1,157 మంది పిల్లలకు కూడా మాత్రలు అందజేయనున్నారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, శారీరక ఎదుగుదల లోపం, కడుపునొప్పి, బలహీనత, ఆకలి లేకపోవడం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయని అధికారులు తెలిపారు. ఆల్బెండజోల్ మాత్రల వాడకం ద్వారా రక్తహీనత నియంత్రణతో పాటు పిల్లల ఆరోగ్య స్థితి మెరుగుపడుతుందని వివరించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో కార్యక్రమం చేపడుతున్నామని, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు సహకరించాలని డీఎంహెచ్ఓ కోరారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.


